పద్మశాలి సంఘం ఐక్యవేదిక అధ్యక్షులు సుదర్శన్
నవతెలంగాణ – పాలకుర్తి
చేనేత కార్మికుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం కృషి చేయాలని చేనేత ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు కూరపాటి సుదర్శన్ ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పద్మశాలి సంఘం ఐక్యవేదిక సమావేశంలో సుదర్శన్ మాట్లాడుతూ పద్మశాలీలకు వడ్డీ లేని రుణాలను అందించి ఆదుకోవాలని కోరారు. పద్మశాలీలకు గుర్తింపు కార్డులను ఇవ్వాలని, అర్హులందరికీ పెన్షన్ ఇవ్వాలని అన్నారు. చేనేత సహకార సంఘాల్లో సభ్యులుగా నియమించేందుకు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలన్నారు.
చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించి, చేనేత సొసైటీల అభ్యున్నతికి పాటుపడాలని ప్రభుత్వాన్ని కోరారు. హక్కుల సాధన కోసం చేనేత కార్మికులు ఉద్యమించాలని సూచించారు. అనంతరం ఐక్యవేదిక మండల కమిటీని ఎన్నుకున్నారు. చేనేత ఐక్యవేదిక మండల అధ్యక్షునిగా వైట్ల రామ్మూర్తి, ఉపాధ్యక్షులు పోగు వాసుదేవ్, బిర్రు వెంకటేష్, మండల కార్యదర్శిగా చిలుకమారి సోమేశ్వర్, సహాయ కార్యదర్శులుగా ఎలిగేటి నరేందర్, మాచర్ల అనిల్, సోషల్ మీడియా కన్వీనర్ గా రాపోలు రాంబాబులను ఎన్నుకున్నామని సుదర్శన్ తెలిపారు.