– ఆయన కంపెనీలపై సీబీఐ దాడులు
– ఎస్బీఐ రుణ మోసం కేసులో విచారణ
న్యూఢిల్లీ : బ్యాంక్ రుణ మోసం కేసులో రిలయన్స్ గ్రూపు చైర్మెన్ అనిల్ అంబానీకి ఉచ్చు బిగుస్తోంది. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని మోసం చేసిన కేసులో ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ ప్రారంభించగా.. తాజాగా సీబీఐ కూడా సోదాలు చేసింది. బ్యాంక్ ఫ్రాడ్ కేసులో అనిల్ అంబానీకి సంబంధించిన కంపెనీలు, ఇతర ప్రాంతాల్లో సీబీఐ శనివారం సోదాలు చేపట్దింది. అనిల్ గ్రూప్ కంపెనీలు పలు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని అవకతవకలకు పాల్పడ్డాయనే ఆరోపణలపై ఆయనపై కేసు నమోదైంది. దాంతో ఇప్పటికే ఆయన కార్యాలయాల్లో ఈడీ సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. రెండు వారాల క్రితం ఆయనను 10 గంటల పాటు ప్రశ్నించింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేసింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)కి రూ.2వేల కోట్ల మేర మోసం కేసులో తాజాగా సీబీఐ సోదాలు నిర్వహించింది.
నష్టాల్లో చిక్కుకున్న టెలికాం సంస్థ రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్కామ్) తీసుకున్న రుణాన్ని కొన్ని నెలల క్రితం మోసపూరిత చర్య అని ఎస్బీఐ నిర్ణయించిన విషయం తెలిసిందే. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మార్గదర్శకాల ప్రకారం.. ఏదైనా ఒక బ్యాంకు, ఒక ఖాతాను మోసపూరితమైందని గుర్తించిన తర్వాత ఆ విషయాన్ని 21 రోజుల్లోగా ఆర్బీఐకి తెలపాలి. కేసును సీబీఐ, పోలీసులకు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే సీబీఐ కేసు నమోదు చేసింది. ఇక ఈడీ ప్రాథమిక నివేదిక ప్రకారం.. 2017 నుంచి 2019 మధ్య కాలంలో యెస్ బ్యాంక్ నుంచి తీసుకున్న రూ.3 వేల కోట్ల రుణాలను అనిల్ అంబానీ కంపెనీలు అనుమానాస్పద రీతిలో దారి మళ్లించాయి. ఆ బ్యాంక్ మాజీ ప్రమో టర్లకు లంచం ఇచ్చారన్న ఆరోపణలూ ఉన్నాయి. ఈ అంశంలో యెస్ బ్యాంక్ మాజీ ఎండీ ప్రమోటర్ రాణా కపూర్పై దాఖలైన మనీలాండరింగ్ కేసులో భాగంగా 2020లో అనిల్ అంబానీ ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. అదేతరహాలో మరో రూ.14వేల కోట్లు ఇతర బ్యాంకుల్లో మోసానికి పాల్పడినట్టు అధికారులు వెల్లడించారు.