పొంగిపొర్లుతున్న గ్రామాల చెరువులు
జాతీయ రహదారి పైకి వచ్చిన వరద నీరు
భిక్కనూర్ కామారెడ్డి రాకపోకలు బంద్
10 కిలోమీటర్లు పైగా నిలిచిన వాహనాలు
నవతెలంగాణ-భిక్కనూర్
భిక్కనూర్ మండలంలో మంగళవారం రాత్రి నుండి కురిసిన భారీ వర్షానికి మండలంలోని అన్ని గ్రామాల చెరువులు పొంగిపొర్లుతున్నాయి. ఒక గ్రామం నుండి మరో గ్రామానికి వెళ్లడానికి వీలు లేకుండా చెరువులు, వాగులు, కాలువలు పొంగిపొర్లడంతో రహదారులు మూసుకుపోయాయి. అధికారులు తెలియజేసిన వివరాల ప్రకారం భిక్కనూరు మండలంలో 23 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తెలిపారు. పట్టణ కేంద్రంలో దాసినమ్మ కుంట చెరువు కట్ట తెగిపోవడంతో అధికారులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. బొబ్బిలి చెరువు నిండుకుండలా మారి వర్షం నీరు ఎక్కువగా రావడంతో 44 జాతీయ రహదారిపై చెరువులోని వర్షం నీరు వరదల వచ్చి చేరింది.

దీంతో భిక్కనూర్ కామారెడ్డి జాతీయ రహదారిపై వాహనాలు వెళ్లకుండా పోలీసులు నిలిపివేయడంతో సుమారు 10 కిలోమీటర్లకు పైగా వాహనాలు నిలిచిపోయాయి. మండల ప్రత్యేక అధికారి శ్రీనివాస్, ఎంపీడీవో రాజ్ కిరణ్ రెడ్డి, పంచాయతీ అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితులు పరిశీలిస్తూ శిథిలావస్థలో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

గతంలో ఎన్నడు లేని విధంగా భారీ వర్షం రావడంతో మండలంలోని పంట పొలాలు పూర్తిగా మునిగిపోయాయి. చెడిపోయిన రహదారులు అధికారులు బాగు చేసి, పంట నష్టం జరిగిన వారికి నష్టపరిహారం చెల్లించాలని ప్రజలు, రైతులు కోరుచున్నారు. చెరువులోకి భారీగా వర్షం నీరు చేరి పొంగి పొర్లడంతో ప్రజలు చెరువు ప్రాంతాలకు వెళ్లకుండా పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేసి జాగ్రత్తలు తీసుకున్నట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు.