- 71 ఏండ్లుగా నిరంతరాయంగా పెట్టడం గొప్ప విషయం
- మండపాలకు ఉచిత విద్యుత్ ఇస్తున్నది తెలంగాణే : సీఎం రేవంత్రెడ్డి
- ఖైరతాబాద్ గణనాథున్ని దర్శించుకున్న ముఖ్యమంత్రి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
దేశంలోనూ, తెలంగాణలోనూ గణేశ్ ఉత్సవాలంటే గుర్తొచ్చేది ఖైరతాబాద్ వినాయకుడే అనీ, దేశమంతటా చర్చించుకునే స్థాయిలో ఉత్సవాలు నిర్వహిస్తున్న కమిటీని అభినందిస్తున్నానని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి అన్నారు. శుక్రవారం హైదరాబాద్లో ఖైరతాబాద్ బడా గణపతిని సీఎం దర్శించుకున్నారు. ఖైరతాబాద్ గణపతి ఉత్సవాలు 71 ఏండ్లు పూర్తిచేసుకోవడంపై సంతోషం వ్యక్తం చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ, ఏ నగరంలోనూ గణేశ్ మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వట్లేదని గుర్తుచేశారు. గణపతి మండపాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని నొక్కి చెప్పారు. ఉత్సవాల నిర్వహణలో తలెత్తే సమస్యలను తెలుసుకుంటూ, అధికారులను సమన్వయం చేసుకుంటూ, పరిష్కరించుకుంటూ ముందుకెళ్లామని చెప్పారు. అన్ని మతాలను గౌరవిస్తూ హైదరాబాద్ మహానగరం మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోందన్నారు. నిమజ్జనాలకు ఇబ్బంది కలుగకుండా ట్యాంక్బండ్తో పాటు ఇతర ప్రాంతాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. భక్తి శ్రద్ధలతో నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవాలని ప్రతి ఒక్కరికీ విజ్ఞప్తి చేశారు.