ప్రయివేటు విద్యాసంస్థల పోరాటానికి మద్దతిస్తున్నాం: బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.రాంచందర్రావు
వతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఫీజు రీయింబర్స్మెంట్ పెండింగ్ బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.రాంచందర్రావు డిమాండ్ చేశారు. సోమవారం హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదల కోసం ప్రయివేటు విద్యాసంస్థల మేనేజ్మెంట్లు, అసోసియేషన్లు ప్రకటించిన కాలేజీల బంద్కు తమ పార్టీ మద్దతు ఉంటుందని ప్రకటించారు. కాలేజీలకు భారీగా బకాయిలు పెరగడంతో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రయివేటు కాలేజీలు తాత్కాలికంగా మూసివేయాల్సిన పరిస్థితికి వచ్చాయని చెప్పారు. బకాయలు రూ.8 వేల కోట్లకుపైగా ఉన్నప్పటికీ రెండేండ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం పైసా విడుదల చేయలేదని విమర్శించారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన రూ.5 లక్షల విలువైన విద్యాభరోసా కార్డుల హామీ ఏమైందని నిలదీశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి సీఎం రేవంత్రెడ్డి వెయ్యికోట్ల రూపాయలు ఇస్తామని వాగ్దానం చేశారనీ, మరోవైపు రాష్ట్రంలో రిటైర్డ్ టీచర్లకు పెన్షన్లు కూడా ఇవ్వని పరిస్థితి దాపురించిందని తెలిపారు. కొత్త యూనివర్సిటీలకు కనీసం భవన నిర్మాణాలు చేయకపోవడం సబబుకాదన్నారు. విద్యా వ్యవస్థను కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.