భారత్, అమెరికా మధ్య ముగిసిన చర్చలు
ఏడు గంటలకుపైగా వాణిజ్య ఒప్పందంపై భేటీ
కొలిక్కిరాని ఆరో విడత ద్వైపాక్షిక సమావేశం
న్యూఢిల్లీ : భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందంపై సుధీర్ఘ చర్చలు జరిగాయి. మంగళవారం ఏడు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో అమెరికా నుంచి చీఫ్ నెగోషియేటర్ బ్రెండన్ లించ్, భారత్ నుంచి అదనపు కార్యదర్శి రాజేశ్ అగర్వాల్ హాజరయ్యారు. ఇరుదేశాలమధ్య వాణిజ్య ఒప్పందంపై నిర్ణయానికి రాలేదని సమాచారం. అయితే అమెరికా తన డిమాండ్లను భారత్పై రుద్దేలా ఉన్నాయని అధికారవర్గాలు ధ్రువీకరించాయి. అమెరికా తమ పాడి, వ్యవసాయ ఉత్పత్తులను భారతదేశంలో విక్రయించాలని కోరుకుంటోంది. మోడీ తలొగ్గితే..ఆయా రంగాలపై ఆధారపడిన ప్రజలంతా తీవ్రంగా వ్యతిరేకించే అవకాశముంది. ట్రంప్ అధికారంలో వచ్చాక ద్వైపాక్షిక భేటీలు ఐదుసార్లు జరిగినా కొలిక్కిరాలేదు. తాజాగా ఆరోసారి భేటీ అయినా చూద్దాం.. చేద్దామనేంత వరకే సమావేశం సాగిందని తెలిసింది.