పొంగి పొర్లుతున్న నదులు
ఇస్లామాబాద్ : పాకిస్తాన్వ్యాప్తంగా ఈ వర్షాకాలంలో భారీగా వర్షాలు పడడం, నదులు పొంగిపొర్లడంతో సంభవించిన వరదల్లో వెయ్యిమందికి పైగా మరణించారు. జాతీయ విపత్తు నిర్వహణా సంస్థ (ఎన్డిఎంఎ) గురువారం ఈ మేరకు ధృవీకరించింది. వరదల కారణంగా లక్షలాదిమంది నిర్వాసితులయ్యారు. ఇళ్ళు, మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి. గత మూడేళ్ళ కాలంలో ఇలాంటి పరిస్థితులను చూడలేదు. జూన్ 26 నుండి వేసిన లెక్కల్లో వరదల్లో 1002 మంది మరణించగా, మరో వెయ్యిమంది గాయపడ్డారని తెలిపింది. ఖైబర్ పక్తునువా ప్రావిన్స్ అన్నింటికంటే బాగా దెబ్బతింది. ఈ ప్రావిన్స్లో అత్యధికంగా 504 మంది మరణించారు.ఆ తర్వాత పంజాబ్ ప్రావిన్స్లో 300, సింధులో 80, బలూచిస్తాన్లో 30, గిల్గిట్-బాల్టిస్తాన్లో 41 మంది, పాక్ ఆక్రమిత కాశ్మీర్లో 39మంది, ఇస్లామాబాద్లో 9మంది మరణించారు. 4 వేలకు పైగా ఇళ్ళు వరద నీటిలో కొట్టుకుపోయాయి. మరిన్ని నివాసాలు కకావికలమయ్యాయి. మొత్తంగా 24 లక్షల మంది వరద బాధితులు వున్నారు. ప్రధానంగా సింధునదీకి అత్యధికంగా వరద వచ్చింది. అలాగే సట్లెజ్, జీలం, చినాబ్ నదులు కూడా అసాధారణ రీతిలోనే నీటి మట్టాలను నమోదు చేశాయి. పాక్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా తూర్పున ప్రవహించే ఈ నదులు మూడు ఒకేసారి ప్రమాద స్థాయికి చేరుకున్నాయి. 2022 తర్వాత అత్యంత భయంకరంగా వచ్చిన వరదలంటే ఇప్పుడేనని అధికారులు కూడా పేర్కొంటున్నారు. ఆనాటి వరదల్లో 1700 మందికి పైగా మరణించారు. దేశంలో మూడోవంతు భాగం మునిగిపోయింది. రూ.3200 కోట్ల మేరకు నష్టం వాటిల్లింది.