ప్రజల్లో రోడ్ రూల్స్, ట్రాఫిక్ రూల్స్పై అవగాహన పెంచటానికి, రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి హైదరాబాద్ పోలీసులు ‘ట్రాఫిక్ సమ్మిట్ 2025’ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హీరో సాయి దుర్గ తేజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన పోలీస్ శాఖకు రూ.5 లక్షలు విరాళాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా హీరో సాయి దుర్గ తేజ్ మాట్లాడుతూ, ‘బైక్ నడిపే ప్రతీ ఒక్కరికీ హెల్మెట్ తప్పకుండా ధరించాలి. సీట్ బెల్ట్స్ పెట్టుకోవాలి. ట్రాఫిక్ రూల్స్ పాటించటం వల్ల మీకే కాదు. ఎదురుగా వచ్చే తోటి ప్రయాణీకులకు కూడా మంచిది. నా తోటి స్టార్ హీరోలను కూడా సినిమాల్లో నటించేటప్పుడు కూడా హెల్మెట్స్ ధరించి స్టంట్స్ చేయమని చెబుతాను. ట్రాఫిక్ పోలీసులు మనం గుర్తించని హీరోలనే చెప్పాలి. ఇంట్లో మనం భయం లేకుండా ఉంటున్నామంటే అందుకు కారణం అమ్మ, నాన్న, అక్క..అలా కుటుంబ సభ్యులే. కానీ.. మనం బయటకు ధైర్యంగా వెళుతున్నామంటే కారణం పోలీసులే. వారికి సెల్యూట్ చేయాల్సిందే. అలాంటి వాళ్లు బావుండాలని కోరుకోవాలి’ అని తెలిపారు.