నవతెలంగాణ – హైదరాబాద్: సమాజానికి ఆదర్శంగా నిలవాల్సిన ఓ ప్రధానోపాధ్యాయుడు, తాను పనిచేసే బడిలోనే మద్యం మత్తులో హల్చల్ చేశాడు. విచారణ కోసం వచ్చిన ఉన్నతాధికారిపైనే బూతుల వర్షం కురిపించి అందరినీ విస్మయపరిచాడు. ఈ షాకింగ్ ఘటన ఏపీలోని విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే… మెంటాడ మండలం కుంటినవలస హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు గత కొంతకాలంగా మద్యం సేవించి విధులకు హాజరవుతున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఫిర్యాదులపై విచారణ చేపట్టేందుకు డిప్యూటీ డీఈఓ స్వయంగా పాఠశాలకు వెళ్లారు.
అయితే, అప్పటికే మద్యం మత్తులో ఉన్న ఆ ప్రధానోపాధ్యాయుడు, అధికారిని చూసి సహనం కోల్పోయాడు. విచారణకు సహకరించకపోగా, ఆయన ముందే అసభ్య పదజాలంతో దూషణలకు దిగాడు. ఈ దృశ్యాలను అక్కడున్న వారు సెల్ఫోన్లో చిత్రీకరించగా ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో ఈ ఘటన విద్యాశాఖ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. ఈ వీడియో ఆధారంగా సదరు ప్రధానోపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమవుతున్నట్లు సమాచారం. పవిత్రమైన బడిలోనే గురువు ఇలా ప్రవర్తించడంపై స్థానికులు, విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.