34 శాతమే బోనస్ ఇవ్వడమేంటి?
సింగరేణి కార్మికులకు ఇది చేదు కబురు
వారి పక్షాన కొట్లాడుతాం : మాజీ మంత్రి హరీశ్రావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సింగరేణి కార్మికులకిచ్చే బోనస్ను రేవంత్రెడ్డి సర్కారు బోగస్ చేసిందనీ, కార్మికులకిచ్చే లాభాల్లో 50శాతానికిపైగా కోత విధించిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. రూ. 6394 కోట్ల లాభాలు గడిస్తే కేవలం 2360 కోట్లలో 34 శాతం బోనస్ ఇవ్వడమేంటని ప్రశ్నించారు. దసరా పండుగ పూట సింగరేణి కార్మికులకు ఇది తీపి వార్త కాదనీ, చేదు కబురని విమర్శించారు. సమైక్యరాష్ట్రంలోనైనా, ఇప్పుడైనా సింగరేణి కార్మికులకు ద్రోహం చేసిన పార్టీ కాంగ్రెస్సేనని ఆరోపించారు. సోమవారం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. నికర లాభాల్లో 34 శాతాన్ని బోనస్గా ప్రకటించాలని డిమాండ్ చేశారు. లాభాల వాటాలో 50శాతం కోత విధిస్తూ కార్మికులకు చేసిన అన్యాయాన్ని బిఆర్ఎస్ పార్టీ పక్షాన ఖండిస్తున్నామని తెలిపారు. గతేడాది సింగరేణి భవిష్యత్ ప్రణాళిక కోసమని పక్కనబెట్టిన రూ.2,283 కోట్లు ఏమయ్యాయో తెలియని పరిస్థితి అని పేర్కొన్నారు. ఇప్పుడు రూ.4034 కోట్ల సింగరేణి సొమ్ముకు ఎసరు పెట్టారని ఆరోపించారు. కార్మికులకు రావాల్సిన వాటా ఎవరి జేబులకు మళ్లిస్తున్నారని ప్రశ్నించారు. సింగరేణి సంస్థను లాభాల బాట పట్టించింది కేసీఆర్నే అని పేర్కొన్నారు. సింగరేణి కార్మికులకు న్యాయం దక్కే దాకా పోరాటం చేస్తామని ప్రకటించారు.