సిరిసిల్ల జిల్లాకు చెందిన మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు కడారి సత్యనారాయణరెడ్డి మృతి
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
అర్ధ శతాబ్దపు సాయుధ పోరాటంలో అగ్రగామిగా ఉన్న రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన మావోయిస్టు నేత కడారి సత్యనారాయణరెడ్డి అలియాస్ కోస(70) ప్రస్థానం ముగిసింది. సోమవారం ఛత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణ్పూర్ జిల్లా అంబుజ్గఢ్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో ఆయన మరణించినట్టు పోలీసులు ప్రకటించారు. కడారి సత్యనారాయణరెడ్డి తంగళ్లపల్లి మండలం గోపాల్రావుపల్లికి చెందినవారు. సిరిసిల్లలో పదో తరగతి వరకు చదివి, పెద్దపల్లిలో ఐటీఐ పూర్తి చేశారు. ఆ తర్వాత విప్లవ భావాలకు ఆకర్షితుడై 1983లో పీపుల్స్ వార్లో చేరారు. అప్పటి నుంచి ఆయన దళ సభ్యుడి నుంచి మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా అంచెలంచెలుగా ఎదిగారు.
42 ఏండ్లుగా ఇంటికి దూరంగా..
మావోయిస్టు ఉద్యమంలోకి వెళ్లిన తర్వాత సత్యనారాయణరెడ్డి తిరిగి స్వగ్రామానికి రాలేదు. కుటుంబ సభ్యులను కూడా కలువలేదు. తల్లిదండ్రులు మరణించినప్పుడు కూడా చివరి చూపుకు రాలేదు. పోలీసులు నిఘా ఉంచినప్పటికీ, ఆయన తన గ్రామానికి రాలేదు. సత్యనారాయణరెడ్డికి ఒక సోదరుడు ఉండగా, ఆయన రాజన్న సిరిసిల్ల జిల్లాలో మండల విద్యాధికారిగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. కడారి సత్యనారాయణరెడ్డిపై రూ.40 లక్షల రివార్డు ఉంది. ఆయన ఎన్కౌంటర్లో మరణించిన వార్త తెలియడంతో స్వగ్రామం గోపాల్రావుపల్లెలో విషాదం నెలకొంది. ఆయన మృతదేహం కోసం గ్రామస్తులు, కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారు.
మావోయిస్టు ఉద్యమంలో ముగిసిన 42 ఏండ్ల ప్రస్థానం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES