లొంగిపోయే ప్రసక్తే లేదు
అణ్వాయుధాలపై ఖమేనీ
టెహ్రాన్ : అణ్వాయుధ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్న ఇరాన్పై త్వరలోనే తిరిగి ఆంక్షలు విధిస్తామంటూ యూరోపియన్ నేతలు చేస్తున్న హెచ్చరికలపై ఆ దేశ సుప్రీం నేత అయతొల్లా ఖమేనీ స్పందించారు. అణ్వాయుధాలను తయారు చేయాలనే ఆలోచన ఏదీ తమకు లేదని ఆయన స్పష్టం చేశారు. అయితే ఈ విషయంలో అమెరికాతో నేరుగా చర్చలు జరిపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అమెరికాతో చర్చలు హానికరమని, అవి చివరి ముగింపు అవుతాయని వ్యాఖ్యానించారు. ఆంక్షల నుంచి తప్పించుకోవాలంటే చర్చలు జరపాల్సి ఉంటుందని ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ చెప్పినప్పటికీ అమెరికాతో సంప్రదింపులు జరపడానికి ఇరాన్కు కారణమేమీ లేదని ఖమేనీ చెప్పారు.
‘యురేనియంను శుద్ధి చేసే విషయంలో మనం పురోగతి సాధించాం. అణ్వాయుధాలను అభివృద్ధి చేయాలని అనుకుంటున్న దేశాలు యురేనియంను 90 శాతం శుద్ధి చేస్తే మనం దానిని 60 శాతానికే పరిమితం చేశాం’ అని ఖమేనీ మంగళవారం జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ తెలిపారు. యురేనియం శుద్ధిని ఆయుధ గ్రేడ్ స్థాయికి పెంచబోమని పునరుద్ఘాటించారు. ఎందుకంటే తమకు అలాంటి ఆయుధాల అవసరం లేదని, అణ్వాయుధాలను కలిగి ఉండాలన్న కోరిక లేదని చెప్పారు. అమెరికాతో చర్చలు జరిపి ప్రయోజనమేమీ లేదని అంటూ వాటి ఫలితాన్ని వాషింగ్టన్ ముందుగానే ప్రకటించిందని గుర్తు చేశారు.