అంగన్వాడీల అరెస్టుపై మాజీ మంత్రి హరీశ్రావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మహిళలను కోటీశ్వరులను చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి వారిని పోలీస్ స్టేషన్లకు తరలిస్తారా? అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. సమస్యల పరిష్కారం కోసం ఛలో సెక్రెటేరియేట్ చేపట్టిన అంగన్ వాడీల పట్ల ప్రభుత్వం పోలీసుల ద్వారా కర్కశంగా వ్యవహరించడాన్ని ఖండించారు. ఆడబిడ్డలకు బతుకమ్మ సంబురాలు లేకుండా చేస్తున్న రేవంత్ సర్కార్కు వారే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. కేసీఆర్ అంగన్వాడీ వర్కర్లను టీచర్లుగా పోస్టును ఉన్నతీకరించి, వారి వేతనాన్ని రూ.4,200 నుంచి రూ.13,650కు, సహాయకుల వేతనాన్ని రూ.2,200 నుంచి రూ.7,800 పెంచారని గుర్తుచేశారు. అంగన్వాడీ టీచర్ల వేతనాన్ని రూ.18 వేలకు పెంచి ఈపీఎఫ్ పరిధిలోకి తెచ్చి ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీతో అధికారంలోకి వచ్చి 22 నెలలు గడిచినా వారిని పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.
కోటీశ్వరులను చేస్తామని చెప్పి పోలీస్ స్టేషన్లకు తరలిస్తారా?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES