రబీ కోసం ముందుగానే సరఫరా చేయండి : కేంద్రానికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
సెప్టెంబర్లో రాష్ట్రానికి యూరియా సరఫరా గత నెలల కంటే మెరుగ్గా రావడం రైతులకు ఎంతో ఊరట కలిగించిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు రాష్ట్రానికి మొత్తం 7.88 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అందగా, ఒక్క సెప్టెంబర్లోనే 1.84 లక్షల మెట్రిక్ టన్నులు సరఫరా జరిగిందని తెలిపారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పదే పదే కేంద్రానికి వివరించడం వల్లనే అదనంగా యూరియా సరఫరా జరిగిందని అన్నారు. దిగుమతి టెండర్లలో ఆలస్యం, అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల కారణంగా దిగుమతులపై ప్రతికూల ప్రభావం పడిందని తెలిపారు.
దాంతో కేంద్రం కూడా రాష్ట్రాలకు సరిపడా యూరియాను అందించలేకపోవడం రైతులను ఇబ్బందులకు గురి చేసిందని వివరించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రైతుల అవసరాలు తీర్చడానికి నిరంతరం కృషి చేసిందని తెలిపారు. ముఖ్యమంత్రి స్వయంగా కేంద్ర మంత్రులను కలవడం, అధికారులతో భేటీలు జరపడం, కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ అవరణలో నిరసనలు వ్యక్తం చేసి వినతిపత్రాలు సమర్పించడంతో కేంద్రం అదనంగా యూరియా సరఫరా చేసిందని మంత్రి తెలిపారు. రానున్న రబీ సీజన్ను దృష్టిలో ఉంచుకొని అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో ప్రతి నెలకు 2 లక్షల మెట్రిక్ టన్నులకు తగ్గకుండా యూరియా సరఫరా చేయాలని కేంద్రాన్ని కోరినట్టు తెలిపారు. రైతులకు యూరియా సరఫరా చేయడంలో రాజీ పడబోమని మంత్రి స్పష్టం చేశారు.
సెప్టెంబర్లో రైతులకు సరిపడా యూరియా అందించాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES