నవతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాద్ నగరంతో పాటు, ఎగువన కురిసిన భారీ వర్షాల కారణంగా జంట జలాశయాలైన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ గేట్లను ఎత్తి భారీగా వరద నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో హైదరాబాద్ నగరంలో మూసీ నది భయానకంగా ప్రవహిస్తోంది. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత మూసీ నది మహోగ్ర రూపం దాల్చింది. దీంతో ఎంజీబీఎస్లోకి వెళ్లే రెండు బ్రిడ్జిలు నీట మునిగాయి. అలాగే మూసీ వరద బస్డాండ్లోకి చేరింది. వేల మంది ప్రయాణికులు బస్డాండ్లో చిక్కుకుపోయారు. వెంటనే అప్రమత్తం అయిన అధికారులు ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే గంట గంటకు వరద పెరుగుతుంది. దీనిక తోడు ప్రస్తుతం ఎంజీబీఎస్ చుట్టూ నీరు చేరడంతో.. అధికారులు తాత్కలికంగా ఎంజీబీఎస్ బస్ స్టాండ్ ను క్లోజ్ చేశారు.
అలాగే అక్కడ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన బస్సులు స్టార్టింగ్ పాయింట్ల (బస్సులు స్టార్టింగ్ పాయింట్ల)ను తాత్కలికంగా మార్చారు. ఇందులో భాగంగా ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ వైపునకు వెళ్లే సర్వీసులు జేబీఎస్ నుంచి నడుపుతున్నారు. అలాగే వరంగల్, హన్మకొండ వైపుకు వెళ్లేవి ఉప్పల్ క్రాస్ రోడ్స్ నుంచి, సూర్యాపేట, నల్లగొండ, విజయవాడ వైపుకు బస్సులు ఎల్బీనగర్ నుంచి, మహబూబ్నగర్, కర్నూల్, బెంగళూరు వైపుకు వెళ్లే ఆర్టీసీ బస్సు సర్వీసులు ఆరాంఘర్ నుంచి నడుస్తున్నట్లు టీజీఎస్ఆర్టీసీ తెలిపింది. కాగా దీనికి సంబంధించిన పూర్తి వివరాలకు టీజీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033 సంప్రదించాలని ఆర్టీసీ సంస్థ సూచించింది.