యుద్ధానికి ముగింపు పలకండి
బెర్లిన్లో లక్ష మందితో భారీ ప్రదర్శన
జర్మనీ ప్రభుత్వ వైఖరిపై ఆగ్రహం
నేతల మాటలు ఘనం… చేతలు శూన్యం : లెఫ్ట్ పార్టీ నేత లైన్స్ స్క్వెడ్నర్
గాజాలో ఇజ్రాయిల్ మారణహోమానికి గురవుతూ ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్న పాలస్తీనియన్లకు సంఘీభావంగా జర్మనీ రాజధాని బెర్లిన్లో శనివారం లక్ష మందికి పైగా ప్రజలు రోడ్ల పైకి వచ్చి భారీ ప్రదర్శన నిర్వహించారు. ఇజ్రాయిల్-హమాస్ యుద్ధానికి వెంటనే ముగింపు పలకాలని నిరసనకారులు కోరారు. పాలస్తీనాకు స్వేచ్ఛ కల్పించాలంటూ నినాదాలు చేశారు. గాజాలో తీవ్రతరమవుతున్న మానవతా సంక్షోభానికి తెర దించాలని డిమాండ్ చేశారు. గాజా స్ట్రిప్లో ఇజ్రాయిల్ దాడులకు జర్మనీ మద్దతు తెలపడాన్ని వారు తీవ్రంగా నిరసించారు.
బెర్లిన్ : పాలస్తీనా అనుకూల సంఘాలు, మెడికో ఇంటర్నేషనల్, అమ్నెస్టీ ఇంటర్నేషనల్, ప్రతిపక్ష లెఫ్ట్ పార్టీ సహా దాదాపు యాభై పక్షాలతో ఏర్పడిన కూటమి భారీ ప్రదర్శనకు పిలుపునిచ్చింది. ప్రదర్శకులు బెర్లిన్ సిటీ హాలు నుంచి గ్రాసర్ స్టెర్న్ దిశగా కదిలారు. ఇజ్రాయిల్కు ఆయుధ ఎగుమతు లను నిలిపివేయాలని ప్రభుత్వాన్ని ప్రదర్శకులు డిమాండ్ చేశారు. ఇజ్రాయిల్పై ఆంక్షలు విధించాలని యూరోపియన్ యూనియన్ను కోరారు. ఇజ్రాయిల్కు అన్ని రకాల సైనిక సహాయాన్ని…అంటే ఎగుమతి దిగుమతులు, ఆయుధాలు, పేలుడు పదార్థాలు, ఇతర సైనిక సామగ్రి రవాణాను నిలిపివేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రదర్శనకారు ల చేతుల్లో పాలస్తీనా పతాకాలు కనిపించాయి. జర్మనీ పశ్చిమ ప్రాంతంలో ఉన్న డస్సెల్డార్ఫ్ నగరంలో కూడా వేలాది మంది ప్రజలు పాలస్తీనా అనుకూల ప్రదర్శన జరిపారు.
గాజాను తాము మరచిపోబోమని అంటూ పాలస్తీనాకు, అణచివేతకు గురవుతున్న ప్రజలకు స్వేచ్ఛ కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఇదిలావుండగా గాజాలో యుద్ధానికి ముగింపు పలకాలని కోరుతూ జెనీవాలో ఆరు వేల మంది ప్రదర్శన నిర్వహించారని స్విస్ ప్రభుత్వ బ్రాడ్కాస్టర్ ఎస్ఆర్ఎఫ్ తెలిపింది.గత కొన్ని వారాలుగా ఇతర యూరోపియన్ నగరాలలో కూడా ఇజ్రాయిల్ వ్యతిరేక ప్రదర్శనలు జరుగుతు న్నాయి. ఇజ్రాయిల్కు సైనిక సామగ్రిని ఎగుమతి చేసేందుకు జర్మనీ ఎవరికీ అనుమతి ఇవ్వబోదని ఛాన్సలర్ ఫ్రెడ్రిచ్ మెర్జ్ గత నెలలో చెప్పారు. అయితే ఇజ్రాయిల్పై ఆంక్షలు విధించడాన్ని సమర్ధించే విషయలో మాత్రం జర్మనీ వెనకడుగు వేస్తోంది. ఇజ్రాయిల్ను గట్టిగా సమర్ధిస్తున్న దేశాల్లో జర్మనీ ఒకటి. అనేక దశాబ్దాలుగా ఇజ్రాయిల్ అనుకూల వైఖరిని ప్రదర్శిస్తోంది.
ఇజ్రాయిల్ నేరాలలో జర్మనీ భాగస్వామ్యం : లెఫ్ట్ పార్టీ చైర్ఉమన్ లైన్స్ స్క్వైడ్నర్
ప్రదర్శకులను ఉద్దేశించి లెఫ్ట్ పార్టీ చైర్ఉమన్ లైన్స్ స్క్వెడ్నర్ ప్రసంగిస్తూ గాజాలో ఇజ్రాయిల్ సాగిస్తున్న మారణహోమాన్ని ఖండించారు. జర్మనీ ప్రభుత్వం ఇజ్రాయిల్ నేరాలలో భాగస్వామిగా ఉన్నదని ఆరోపించారు. ”ఛాన్సలర్, మంత్రులు ఏవేవో మాట్లాడ తారు. కానీ క్రియ శూన్యం. ఆస్పత్రులు శిథిలాలుగా మారుతుంటే వారు మౌనం వహిస్తారు” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా ”ఇజ్రాయిల్ ప్రభుత్వ చర్యలను నిపుణులు, అంతర్జాతీయ సంస్థలు చాలా కాలంగా మారణహోమంగా అభివర్ణిస్తున్నాయి. ఆ చర్యలపై ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ విచారణ జరుపుతోంది. ఇజ్రాయిల్ సైన్యం గాజాలో ఏ విధంగా సామూహిక వేధింపులకు పాల్పడుతోందో ప్రతి ఒక్కరూ చూడవచ్చు. ఓ పథకం ప్రకారం హింస జరుగుతున్నప్పటి కీ జర్మనీ ప్రభుత్వం దానిని ఖండించడం లేదు” అని ప్రదర్శన నిర్వాహకులు ఓ ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు.