నవతెలంగాణ-హైదరాబాద్ : బాణాసంచా పేలి దంపతులు దుర్మరణం పాలైన ఘటన అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం విలస గ్రామంలో చోటుచేసుకుంది. గత సంవత్సరం నిల్వ ఉంచిన మందుగుండు సామాగ్రిని బయటకు తీసే క్రమంలో ప్రమాదవశాత్తు పేలుడు సంభవించడంతో ఈ దుర్ఘటన జరిగింది.
పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కంచర్ల శ్రీనివాస్ (55), ఆయన భార్య సీతామహాలక్ష్మి (50) తమ నివాసంలో గతంలో నిల్వ చేసిన మందుగుండు పదార్థాలను బయటకు తీసేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో ప్రమాదవశాత్తు ఒక్కసారిగా పేలుడు సంభవించింది. పేలుడు తీవ్రతకు ఇంటి గోడలు కూలడంతో వారు శిథిలాల కింద పడిపోయారు.
ప్రమాద స్థలానికి పి.గన్నవరం సీఐ భీమరాజు నేతృత్వంలో పోలీసులు, రెవెన్యూ సిబ్బంది చేరుకుని విచారణ ప్రారంభించారు. శిథిలాల కింద ఉన్న మృతదేహాలను వెలికితీశారు.
ఈ ఘటనపై స్పందించిన కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా సంఘటన స్థలాన్ని సందర్శించి మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.