– ఒకరికి గాయాలు
నవతెలంగాణ – కమ్మర్ పల్లి
మండల కేంద్రం శివారులో 63వ నంబర్ జాతీయ రహదారిపై జగిత్యాల జిల్లా మెట్ పల్లి వెళ్లే రోడ్డులో బుధవారం మధ్యాహ్నం కారును ఆర్టీసీ బస్సు ఢీ కొట్టిన సంఘటనలో ఒకరికి గాయాలయ్యాయి. సంఘటనకు సంబంధించి కమ్మర్ పల్లి ఎస్ఐ అనిల్ రెడ్డి తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మండల కేంద్రం నుండి మెట్ పల్లి వెళ్లే రోడ్డులో లలిత ఆశ్రమం సమీపంలో జగిత్యాల జిల్లా బండలింగాపూర్ మండలం రాజేశ్వరరావు పేట్ గ్రామానికి చెందిన దుంపల సాయికుమార్ తన మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ కారులో మోర్తాడ్ నుండి రాజేశ్వరరావు పేట్ వెళ్తున్నాడు.అదే సమయంలో మెట్ పల్లి వైపు నుండి కమ్మర్ పల్లి వైపు వస్తున్న కరీంనగర్ 2 డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ముందు నుండి దుంపల సాయికుమార్ కారుకు ఢీ కొట్టింది. ఈ రోడ్డు ప్రమాదంలో కారులో ఉన్న దుంపల సాయికుమార్ కుడి చేయి, ఇతర చోట్ల గాయాలు అయ్యాయి. ప్రమాదంలో కారు కుడి వైపు ముందటి భాగం నుజ్జు నుజ్జు అయ్యింది. ప్రమాదంపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ జి.అనిల్ రెడ్డి తెలిపారు.