బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే 700 మందికిపైగా రైతన్నలు ఆత్మహత్యలకు పాల్పడడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఆందోళన వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలో రైతుబంధు పాలన స్వర్ణయుగమని పేర్కొన్నారు. అప్పుడు రైతుల ఆత్మహత్యలు దేశంలోనే రికార్డు స్థాయిలో 96 శాతం తగ్గాయంటూ కేంద్ర ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయని వివరించారు. ఈ మేరకు ఆయన బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అద్భుతమైన ప్రగతిని సాధించిన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే పరిస్థితి తారుమారైందని తెలిపారు. కేసీఆర్ పాలన ముగిసే నాటికి 56 మంది రైతుల ఆత్మహత్యలు నమోదైతే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కేవలం రెండేండ్లలోనే సుమారు 700కు పైగా అన్నదాతల ఆత్మహత్యలు నమోదయ్యాయని వివరించారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ, అమానవీయ పాలనకు నిదర్శనమని విమర్శించారు. ఎన్సీఆర్బీ నివేదిక ప్రకారం, గత పదేండ్లలో కేసీఆర్ హయాంలో రైతుల ఆత్మహత్యల తగ్గింపు దేశంలోనే అత్యధికంగా తెలంగాణలోనే నమోదైందని ప్రకటించిందని పేర్కొన్నారు. 2014లో రాష్ట్రంలో రైతులు, కౌలుదారులు, రైతు కూలీల ఆత్మహత్యల సంఖ్య 1,347గా ఉంటే, కేసీఆర్ పాలన ముగిసే నాటికి, 2023 నాటికి ఆ సంఖ్య కేవలం 56కు తగ్గిందని తెలిపారు. రైతుల ఆత్మహత్యల్లో 95.84 శాతం తగ్గుదల నమోదైందని పేర్కొన్నారు. 2014లో దేశంలోని మొత్తం రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ వాటా 10.9 శాతం ఉంటే, 2023 నాటికి అది కేవలం 0.51 శాతానికి తగ్గిందని వివరించారు. మహారాష్ట్రలో డబుల్ ఇంజిన్ సర్కారు బీజేపీ అధికారంలో ఉందని తెలిపారు. అక్కడ రైతుల ఆత్మహత్యలు విపరీతంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. బీఆర్ఎస్ హయాంలో అమలైన రైతు సంక్షేమ పథకాల వల్లే ఆత్మహత్యలు తగ్గడానికి కారణమని వివరించారు. రైతులు చల్లగా, నూరేండ్లు వర్ధిల్లాలి, సంక్షేమ పాలన కొనసాగాలంటే మళ్లీ కేసీఆర్ రావాలి ఆయన ఆకాంక్షించారు.
కాంగ్రెస్ వచ్చాకే 700 కుపైగా రైతన్నల ఆత్మహత్యలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES