– పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు ఆర్థిక సహాయం
నవతెలంగాణ–కమ్మర్ పల్లి
మండల కేంద్రానికి చెందిన ఎన్ఆర్ఐ గుగ్గిళ్ళ దేవరాజ్ అందిస్తున్న సేవలు పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. సొంత ఊరికి ఏదైనా చేయాలన్న సంకల్పంతో దేవరాజ్ పారిశుద్ధ్య కార్మికులకు ఆర్థిక తోడ్పాటు అందించాలని సంకల్పించారు. కమ్మర్ పల్లి గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు ప్రతి సంవత్సరం తన వంతు ఆర్థిక సహాయం అందించేందుకు రూ.4.50 లక్షలతో నిధిని ఏర్పాటు చేసి బ్యాంకులో డిపాజిట్ చేశారు.
ఈ డిపాజిట్ ద్వారా వచ్చే వడ్డీ డబ్బులను ప్రతి సంవత్సరం దసరా పండుగకు పారిశుద్ధ్య కార్మికులకు నగదు రూపెన ఆర్థిక సహకారం అందిస్తున్నారు. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా వడ్డీ రూపంలో వచ్చిన రూ.91వేల 260 లను 18 మంది కార్మికులకు రూ.5070 చొప్పున స్థానిక గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు భోగ రామస్వామి చేతుల మీదుగా అందజేశారు.
కష్టకాలంలో తమకు ఆర్థిక తోడ్పాటును అందించి అండగా నిలిచిన ప్రవాస భారతీయుడు గుగ్గిళ్ళ దేవరాజ్ కు పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామం పై ఉన్న ప్రేమతో సేవా కార్యక్రమాలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్న ఎన్ఆర్ఐ గుగ్గిళ్ళ దేవరాజ్ సేవా కార్యక్రమాలను గ్రామస్తులు అభినందిస్తున్నారు.