గ్రేటాకూ వేధింపులు తప్పలేదు
అంతర్జాతీయ కార్యకర్తల ఆవేదన
ఇస్తాంబుల్ : ఇజ్రాయిల్ మారణహోమం కారణంగా గాజా స్ట్రిప్లో అష్టకష్టాలు పడుతున్న పాలస్తీనీయులకు మానవతా సాయాన్ని అందించడానికి వస్తున్న అనేక నౌకలను అధికారులు అడ్డుకుంటున్న విషయం తెలిసిందే. సహాయ సామగ్రితో వస్తున్న పలువురు అంతర్జాతీయ కార్యకర్తలను ఇజ్రాయిల్ సైనికులు నిర్బంధించి బలవంతంగా తిప్పి పంపుతున్నారు. స్వీడన్కు చెందిన వాతావరణ ప్రచారకురాలు గ్రేటా థన్బర్గ్ కూడా గతంలో నిర్బంధానికి గురయ్యారు. ఆమెతో పాటు మరికొందరు పాలస్తీనా అనుకూల కార్యకర్తలను సహాయ బోటులోనే అరెస్ట్ చేశారు. ఆమెను జూన్ 10న బెన్ గురియన్ విమానాశ్రయం నుంచి తిప్పి పంపారు. అయితే గ్రేటా పట్ల ఇజ్రాయిల్ దళాలు అమానుషంగా ప్రవర్తించాయని పలువురు సహాయ కార్యకర్తలు ఆరోపించారు. బలవంతంగా తిప్పిపంపిన 137 మంది కార్యకర్తలు శనివారం ఇస్తాంబుల్ చేరుకున్నారు. వీరిలో 36 మంది టర్కీ జాతీయులు ఉన్నారు. అమెరికా, ఇటలీ, మలేసియా, కువైట్, స్విట్జర్లాండ్, తునీసియా, లిబియా, జోర్డాన్ తదితర దేశాల కార్యకర్తలు కూడా నిర్బంధానికి గురయ్యారు.
ఇజ్రాయిల్ దళాలు గ్రేటాను వేధించడం తాను చూశానని సహాయ నౌకలో వెళ్లిన టర్కీ పాత్రికేయుడు ఎర్సిన్ సెలిక్ తెలిపారు. ఆమెను నేలపై పడేశారని, ఇజ్రాయిల్ పతాకాన్ని ముద్దాడాలని ఒత్తిడి చేశారని చెప్పారు. విమానాశ్రయంలో కూడా గ్రేటా చేతికి ఇజ్రాయిల్ పతాకాన్ని ఇచ్చి దానిని ప్రదర్శించాలంటూ బలవంతం చేశారని మలేసియా, అమెరికా కార్యకర్తలు తెలియజేశారు. వారు తమను జంతువుల మాదిరిగా చూశారని, ఆహారం, తాగునీరు, మందులు ఇవ్వడానికి నిరాకరించారని మరికొందరు వాపోయారు. ‘ఇజ్రాయిల్ సైనికులు మమ్మల్ని కుక్కల మాదిరిగా చూశారు. మూడు రోజుల పాటు ఆకలితో అలమటించేలా చేశారు. కనీసం మంచినీరు కూడా ఇవ్వలేదు. టాయిలెట్లలోని నీరు తాగాల్సి వచ్చింది. అక్కడ ఎండ తీవ్రత అధికంగా ఉంది. మేమంతా మలమల మాడిపోయాం’ అని ఓ మహిళా కార్యకర్త చెప్పారు.