జిల్లా కలెక్టర్ హనుమంతరావు..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
2025 – 26 ఖరీఫ్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో, ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా సక్రమంగా నిర్వహించాలని, అవకతవకలకు పాల్పడితే చర్యలు తప్పవని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత రావు తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశం మందిరంలో 2025-2026, ఖరీఫ్ సీజన్లో ధాన్యం కొనుగోళ్ల కేంద్రాల ఏర్పాటు నిర్వహణ కోసం రెవిన్యూ అదనపు కలెక్టర్ వీరా రెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కరరావు , సంబంధిత అధికారులతో వరి కొనుగోలు సన్నాహక సమావేశంలో అధికారులకు శిక్షణ తరగతులు కలెక్టరేట్ లో నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రానున్న ఖరీఫ్ సీజన్లో ముందస్తు ప్రణాళిక ప్రకారం జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల కేంద్రాల ఏర్పాటు నిర్వహణ సంబంధిత అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో కలిసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతులందరూ టార్పాలిన్ కవర్లు ఎక్కువగా ఉంచుకోవాలన్నారు. కోటి మందిని కోటీశ్వరులు చేయాలని ఉద్దేశంతో మహిళా సంఘాల ద్వారా కొనుగోలు సెంటర్ ను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.
ఐకెపి, సమ భావన సంఘాల సభ్యులు, ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీలు, తదితర సంస్థల ద్వారా సుమారు ( 322) కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందనీ, అందుకోసం జిల్లా స్థాయి దాన్యం కొనుగోళ్ల కేంద్రాల కమిటీ ద్వారా ప్రభుత్వం సూచించిన ప్రకారం ముందుకు వెళ్లడం జరుగుతుందన్నారు.
ధాన్యం సేకరణ వివరాలను వ్యవసాయ శాఖ ద్వార స్వీకరించి కేంద్రాలకు వచ్చే దాన్యం పూర్తి వివరాలు డాటా ఎంట్రీ లో పొందుపరచాలన్నారు. కొనుగోలు రవాణా, డ్రై మిషన్,ప్యాడి క్లీనర్స్, వేయింగ్ మిషన్స్, మ్యాచ్చర్స్, ఆటోమేటిక్ జాలి మిషన్లు, ముందస్తుగా సిద్ధంగా ఉంచుకోవాలన్నారు.
కేంద్రాలలో గన్ని సంచులు, అవసరానికి అనుగుణంగా ముందస్తుగా సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపారు. ధాన్యం కొనుగోలు సెంటర్లో కనీస వసతులైన మంచినీరు, టెంట్, ఫస్ట్ ఎయిడ్ కిట్స్ అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు.ప్యాడి సెంటర్లను శుభ్రంగా ఉండేలా చూడాలన్నారు. ట్యాబ్ ఎంట్రీ ప్రతిరోజు చేయాలన్నారు.
కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంట వెంటనే రైస్ మిల్లులకు పంపే విధంగా ప్రణాళిక ప్రకారం లారీలను, హమాలీలను సిద్ధంగా ఉంచుకునేలా చర్యలు తీసుకోవాలని, కొనుగోళ్లకు సంబంధించి దాన్యం డబ్బుల ను రైతుల ఖాతాలలో వెంటనే జమ అయ్యేందుకు చర్యలు తీసుకోవాలని, కేంద్రాలలో నిబంధనల ప్రకారం అన్ని సౌకర్యాలు కల్పించడం కోసం ఆన్ని శాఖల సమన్వయంతో ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలని ఆయన ఆదేశించారు.వరి ధాన్యం క్వింటాలకి ఏ గ్రేడ్ కు రూ.2389/-, సాధారణ రకం క్వింటాలకి 2369/- చొప్పున ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించిందని అన్నారు. ఈ సమావేశంలో డి ఆర్ డి ఓ నాగిరెడ్డి,డిసిఓ శ్రీధర్, పౌర సరఫరాల సంస్థ మేనేజర్ హరికృష్ణ, డిఏఓ రమణ రెడ్డి, సివిల్ సప్లై రోజారాణి లు పాల్గొన్నారు.