మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు వై.స్వప్న
ఆమన్గల్లో రాష్ట్ర మహాసభల పోస్టర్ విడుదల
నవతెలంగాణ-ఆమనగల్
మధ్యాహ్న భోజన కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు వై.స్వప్న డిమాండ్ చేశారు. ఈ నెల 26, 27 తేదీల్లో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో నిర్వహించనున్న మధ్యాహ్న భోజన కార్మికుల 4వ రాష్ట్ర మహాసభల పోస్టర్ను ఆదివారం ఆమనగల్ పట్టణంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు మధ్యాహ్న భోజన కార్మికులకు ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలన్నారు.
పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా అదనంగా నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులకు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని కోరారు. ఇబ్రహీంపట్నంలో రెండు రోజులపాటు నిర్వహించే రాష్ట్ర మహాసభలకు మధ్యాహ్న భోజన కార్మికులు పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ ఏరియా కన్వీనర్ జే.పెంటయ్య, సంఘం అధ్యక్ష, కార్యదర్శులు సబియా బేగం, పద్మ, ఆమన్గల్, కడ్తాల్, తలకొండపల్లి, మాడ్గుల మండలాలకు చెందిన మధ్యాహ్న భోజన కార్మికులు పాల్గొన్నారు.