ప్రస్తుతం టాలీవుడ్ ప్రపంచ స్థాయికి ఎదిగిన సంగతి తెలిసిందే. తెలుగు చిత్ర సీమ నుంచి సినిమాలు వస్తున్నాయంటే అందరిలోనూ మంచి అంచనాలు ఉంటున్నాయి. ఆ అంచనాలను మరింత రెట్టింపు చేసేందుకు టాలీవుడ్లోకి ఓ కొత్త ప్రొడక్షన్ కంపెనీ అడుగుపెడుతోంది. ఇటీవల సోమో ఐరానిక్ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ లోగోని ఘనంగా లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ‘సోమో ఐరానిక్ ఆర్ట్ క్రియేషన్స్’ బ్యానర్ అధినేత జేజే మాట్లాడుతూ, ‘టాలీవుడ్లోకి నిర్మాతగా వస్తుండటం ఆనందంగా ఉంది. మాలాంటి కొత్త వారిని టాలీవుడ్ ఎంతో ఘనంగా స్వాగతిస్తోంది. ఇక్కడి పెద్దలు మాకు ఎంతో గైడెన్స్ ఇచ్చారు. ఫిల్మ్ ఛాంబర్లో మా సంస్థను రిజిస్టర్ చేశాం. మాకు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి కూడా సహకారం లభించింది. మా సంస్థ లోగోలో చూపించినట్టుగా ఆ వెలుగుని అంతటా పంచాలని ఆశిస్తున్నాం. పరిశ్రమలో పరస్పర సహకారం, ఎదుగుదల అనే కాన్సెప్ట్తో ఆ లోగోను డిజైన్ చేయించాం. ఇక్కడ మేం కొత్త వారిని ఎంకరేజ్ చేయడానికి, కొత్త కథల్ని తెరపైకి తీసుకురావడానికి ప్రయత్నిస్తాం. మా బ్యానర్పై త్వరలో ఒక భారీ సినిమా ప్రారంభం కానుంది. భవిష్యత్తులో ఎన్నో మంచి చిత్రాలను నిర్మించాలన్నదే మా లక్ష్యం’ అని తెలిపారు.