నవతెలంగాణ హైదరాబాద్: గత ఏడాది జీవితకాల పన్ను పెంపుతో పాటు పౌరసేవల రుసుములు పెంచిన రవాణాశాఖ.. ప్రస్తుతం రోడ్డు భద్రతా సెస్సు విధింపునకు సన్నద్ధమైంది. ఆదివారం (మార్చి 1) నుంచి కొనుగోలు చేసే వాహనాలపై రోడ్డు భద్రతా పన్ను వడ్డించనుంది. వాహనం కొనుగోలు సమయంలోనే జీవితకాల పన్ను, రిజిస్ట్రేషన్ చార్జీల చెల్లింపుతో పాటు రోడ్డు భద్రతా పన్ను కూడా చెల్లించాలి. గ్రేటర్లోని మూడు జిల్లాల పరిధిలో ఏటా సుమారు 2 లక్షలకు పైగా కొత్త వాహనాలు రోడ్డెక్కుతున్నాయి. వ్యక్తిగత, రవాణా, ఇతర కేటగిరీలకు చెందిన వాహనాలపై రోడ్డు భద్రతా పన్ను రూపంలో ఇకనుంచి ప్రతి ఏటా సుమారు రూ.130 కోట్లకు పైగా భారం పడే అవకాశం ఉన్నట్లు రవాణావర్గాలు అంచనా వేస్తున్నాయి.
కేంద్రప్రభు త్వం అమల్లోకి తెచ్చిన రోడ్డు భద్రతా చట్టంలో భాగంగా సెస్ విధింపు తప్పనిసరిగా మారినట్లు అధికారులు తెలిపారు. వ్యక్తిగత కేటగిరీలో ద్విచక్ర వాహనాలపై రూ.2 వేలు, కార్లపై రూ.5000 చొప్పున భారం పడనుంది. 4 సీట్లు, 7 సీట్ల సామర్థ్యమున్న వాహనాలు, అంతకంటే ఎక్కువ సీట్లు ఉన్న వాటిపై రూ.10 వేల చొప్పున రోడ్డు భద్రతా సెస్ విధించనున్నారు. వాహనాల కొనుగోలు సమయంలోనే వసూలు చేయనున్న ఈ సెస్ను రోడ్డు భద్రతా నిధిగా వివిధ రకాల కార్యకలాపాలకు వినియోగించనున్నారు. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్లో 89 లక్షల వాహనాలు ఉండగా.. వీటిలో 65 లక్షల వరకు బైక్లే. కొత్తగా కొనుగోలు చేసే వాహనాల్లోనూ బైక్లే ఎక్కువగా ఉండనున్నాయి.



