న్యాయవ్యవస్థ విశ్వసనీయతకు ప్రమాదకరం
న్యాయమూర్తుల అవినీతి, దుష్ప్రవర్తనలపై సీజేఐ గవాయ్ ఆందోళన
యూకే సుప్రీంకోర్టులో ప్రసంగం
జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలకు ప్రాధాన్యత
న్యూఢిల్లీ : న్యాయవ్యవస్థలో అవినీతి, దుష్ప్రవర్తన వంటివి ప్రజా విశ్వాసాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయని భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ బీఆర్ గవాయ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇది మొత్తం న్యాయ వ్యవస్థ విశ్వసనీయతకే ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు. అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక నివాసంలో భారీగా నగదు స్వాధీనమైనట్టు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. యునైటెడ్ కింగ్డమ్(యూకే) సుప్రీంకోర్టులో ‘న్యాయవ్యవస్థ చట్టబద్ధత, ప్రజా విశ్వాసాన్ని కాపాడుకోవడం’ అనే అంశంపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో జస్టిస్ గవాయ్ ప్రసంగించారు. ”ఏ పటిష్టమైన వ్యవస్థలోనైనా దుష్ప్రవర్తన సమస్యలు తలెత్తవచ్చు. న్యాయవ్యవస్థలోనూ అవినీతి ఘటనలు వెలుగుచూడటం విచారకరం. ఇవి ప్రజల విశ్వాసంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి, వ్యవస్థ సమగ్రతపై నమ్మకాన్ని దెబ్బతీస్తాయి” అని ఆయన అన్నారు. ఇలాంటి సమస్యలను పరిష్కరించడానికి వేగవంతమైన, నిర్ణయాత్మకమైన, పారదర్శకమైన చర్యలు అవసరమని చెప్పారు. తద్వారానే కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి పొందగలమని అభిప్రాయపడ్డారు.
ఉన్నత న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల నియామకాలకు కొలీజియం వ్యవస్థను సీజేఐ సమర్థించారు. న్యాయవ్యవస్థ స్వతంత్రతను దెబ్బతీసేలా ఏ పరిష్కారమైనా ఉండకూడదని, న్యాయమూర్తులు బాహ్య నియంత్రణల నుంచి విముక్తులై ఉండాలని స్పష్టం చేశారు. కార్యనిర్వాహక వర్గం గతంలో సీనియారిటీని పక్కనబెట్టి సీజేఐలను నియమించిన సందర్భాలనూ ఆయన గుర్తుచేశారు. పదవీ విరమణ తర్వాత న్యాయమూర్తులు ప్రభుత్వ పదవులు చేపట్టడంపైనా జస్టిస్ గవాయ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి నియామకాల సమయం, వాటి స్వభావం న్యాయవ్యవస్థ నిష్పాక్షికతపై సందేహాలు రేకెత్తిస్తాయనీ, భవిష్యత్ ప్రయోజనాలు ఆశించి తీర్పులు ఇచ్చారనే అభిప్రాయం ప్రజల్లో ఏర్పడవచ్చని హెచ్చరించారు. ఇది సంస్థ సమగ్రతను దెబ్బతీస్తుందని చెప్పారు. ప్రజాస్వామ్యంలో న్యాయవ్యవస్థ కేవలం న్యాయం చేయడమే కాకుండా, అధికారాన్ని ప్రశ్నించగల విశ్వసనీయ సంస్థగా ప్రజలకు కనిపించాలని, పారదర్శకత, జవాబుదారీతనం అత్యంత కీలకమని సీజేఐ నొక్కిచెప్పారు. రాబోయే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో జస్టిస్ యశ్వంత్ వర్మపై అభిశంసన తీర్మానానికి కేంద్రం సిద్ధమవుతున్నట్టు వార్తలు వస్తున్న విషయం విదితమే.
ప్రజల నమ్మకానికి దెబ్బ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES