Friday, May 30, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంకౌమార బాలికలకు వరం…ఇందిరమ్మ అమృతం

కౌమార బాలికలకు వరం…ఇందిరమ్మ అమృతం

- Advertisement -

– ‘ఆడపిల్లలకు శక్తినిద్దాం.. ఆరోగ్య తెలంగాణను నిర్మిద్దాం’ నినాదంతో కొత్త పథకం
– ప్రతి బాలికకూ నెలకు 30 చిక్కీల అందజేత
– హెచ్‌బీ టెస్టు ద్వారా రక్తహీనతతో బాధపడే వారి గుర్తింపు
– అవసరమున్న వారికి ఐరన్‌, ఫోలిక్‌ యాసిడ్‌ మాత్రల అందజేత
– నేడు కొత్తగూడెంలో పథకాన్ని ప్రారంభించనున్న మంత్రి సీతక్క
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

ఆరోగ్య తెలంగాణ నిర్మాణ లక్ష్యంతో ఇప్పటికే అనేక సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్న తెలంగాణ మహిళా, శిశు సంక్షేమ శాఖ తాజాగా మరో కీలక పథకానికి శ్రీకారం చుట్టింది. మంత్రి డాక్టర్‌ ధనసరి అనసూయ సీతక్క ఆదేశాల మేరకు, ”ఇందిరమ్మ అమృతం” పేరుతో 14 నుంచి 18 ఏండ్ల మధ్య వయస్సు గల కౌమార బాలికల రక్తహీనత సమస్యను పరిష్కరించే దిశలో కొత్త పథకం రూపుదిద్దుకుంది. ‘ఆడపిల్లలకు శక్తినిద్దాం..ఆరోగ్య తెలంగాణను నిర్మిద్దాం’ నినాదంతో పథకాన్ని రూపొందించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెంలో ఈ పథకాన్ని గురువారం మంత్రి సీతక్క చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లను ఆ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్‌, శాఖ డైరెక్టర్‌ కాంతి వెస్లీ ఇప్పటికే పూర్తి చేశారు.
ఈ పథకం ద్వారా పైలట్‌ ప్రాజెక్టులో భాగంగా తొలుత భద్రాద్రి కొత్తగూడెం, కొమ్రంభీమ్‌ అసిఫాబాద్‌, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల్లో అమలు చేయనున్నారు. 50, 269 మంది కౌమార బాలికలకు లబ్ది చేకూరనున్నది. పల్లి, చిరుధాన్యాలతో తయారైన చిక్కిలను అంగన్వాడీ కేంద్రాల ద్వారా కౌమార బాలికలకు ఉచితంగా పంపిణీ చేయనున్నారు. ఒక్కో బాలికకు రోజుకు ఒక్కో చిక్కి లెక్కన నెలకు 30 ఇవ్వనున్నారు. ఒక్కో చిక్కిలో సుమారు 600 కేలరీలు, 18-20 గ్రాముల ప్రోటీన్‌లతో పాటు అవసరమైన మైక్రో న్యూట్రియెంట్లు ఉంటాయి. పదిహేను చిక్కిల చొప్పున నెలకు రెండు సార్లు అంగన్వాడీ కేంద్రాల్లో కౌమార బాలికలకు ఇందిరమ్మ అమృతంను అందజేస్తారు.
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 ప్రకారం, తెలంగాణలో 64.7 శాతం కౌమార బాలికలు రక్తహీనతతో బాధపడుతున్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఈ పథకాన్ని రూపొందించారు. బాలికల ఆరోగ్య స్థితిని అంచనా వేసేందుకు హెచ్‌బీ పరీక్షలు నిర్వహించి ఆరోగ్య శాఖ ద్వారా ఐరన్‌, ఫోలిక్‌ యాసిడ్‌ మాత్రలను అందించనున్నారు. దీంతో పాటు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ- సెర్ప్‌ సహకారంతో బాలికల జీవన నైపుణ్యాలను అభివృద్ధి చేసే కార్యక్రమాలు చేపడతారు. రక్తహీనత తగ్గింపుతో పాటు అంగన్వాడీ కేంద్రాల్లో కౌమార బాలికలకు పోషకాహార చైతన్యం, బాల్య వివాహాలపై అవగాహన, ఆరోగ్యం, పరిశుభ్రతపై మహిళా శిశు సంక్షేమ శాఖ అవగాహన కల్పించనుంది. దీంతోపాటు కౌమార బాలికలకు నైపుణ్యాభివృద్ధికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా వారి ఉద్యోగ అవకాశాలను మెరుగుపరచనుంది.
కౌమార బాలికల ఆరోగ్యం, సంక్షేమం, సంరక్షణకు ముందడుగు : మంత్రి సీతక్క
ఆరోగ్య తెలంగాణ నిర్మాణంలో భాగంగా ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పోషకాహారం అందజేస్తున్నాం. మారుతున్న ఆహార అలవాట్లు, జీవన శైలిలో వస్తున్న మార్పులు, ఇతర ఆరోగ్యకారణాల వలన అనేక మంది మహిళలు రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్యను ప్రాథమిక దశలోనే గుర్తించి తగిన సమయంలో చర్యలు తీసుకోవడం అత్యవసరం. అందుకే కౌమార దశ నుంచే రక్తహీనతను తగ్గించేందుకు ‘ఇందిరమ్మ అమృతం’ పథకాన్ని ప్రారంభిస్తున్నాం. ఈ పథకం ద్వారా కౌమార బాలికలకు పోషకాహారం మాత్రమే కాకుండా ఆరోగ్య సంరక్షణ, స్వీయ భద్రత పట్ల అవగాహన పెరిగేలా చర్యలు తీసుకుంటున్నాం.
ఈ పథకాన్ని మొదటి దశలో రక్తహీనత శాతం అత్యధికంగా నమోదైన మూడు జిల్లాల్లో అమలు చేస్తున్నాం. ఈ ప్రాజెక్ట్‌ ద్వారా పొందిన అనుభవాల ఆధారంగా, పథకాన్ని ఇతర జిల్లాలకు కూడా విస్తరిస్తాం. గ్రామీణ ప్రాంతాల్లోని బాలికల ఆరోగ్య పరిరక్షణలో ‘ఇందిరమ్మ అమృతం’ కీలకంగా నిలవనుంది. అందుకే ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుని ఆరోగ్య తెలంగాణ నిర్మాణంలో భాగం కావాలని కౌమార బాలికలకు విజ్ఞప్తి చేస్తున్నాం.
పైలెట్‌ ప్రాజెక్టులో లబ్దిపొందనున్న కౌమార బాలికల సంఖ్య
భద్రాద్రి కొత్తగూడెం – 23,399
కొమ్రం భీం ఆసిఫాబాద్‌ – 18,230
జయశంకర్‌ భూపాలపల్లి – 8,640
మొత్తం లబ్దిదారులు : 50,269 మంది కౌమార బాలికలు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -