నేడు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు, ధర్నాలు : సీఐటీయూ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కేేంద్రంలోని మోడీ సర్కార్ శుక్రవారం నాలుగు లేబర్ కోడ్ల అమలుకు నోటిఫికేషన్ జారీ చేసింది. కార్మిక హక్కులకు అత్యంత ప్రమాదకరంగా ఉన్న ఆ నోటిఫికేషన్ ను వెంటనే ఉపసంహరించు కోవాలని సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ (సీఐటీయూ) డిమాండ్ చేసింది. ఈ మేరకు శుక్రవారం ఆ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్క రాములు, పాలడుగు భాస్కర్ ఒక ప్రకటన విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా శనివారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు, ధర్నాలు నిర్వహించాలని కార్మిక వర్గానికి పిలుప ునిచ్చారు. వేతనాల కోడ్ (2019), పారిశ్రామిక సంబంధాల కోడ్ (2020), సామాజిక భద్రతా కోడ్ (2020), వృత్తిపరమైన భద్రతా, ఆరోగ్యం, పని పరిస్థితుల కోడ్ (2020)ను నవంబర్ 21, 2025 నుండి అమలు చేయటానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని తెలిపారు. ఇది కార్పొరేట్ సంస్థల ప్రయోజనాలు, గరిష్ట లాభాల కోసం చేసిన నష్టదాయక నిర్ణయమని పేర్కొన్నారు. తద్వారా కేంద్రం కార్మిక నిబంధనలను, సంక్షేమాన్ని తుంగలో తొక్కిందని విమర్శించారు.
పెట్టుబడి దారుల ప్రయోజనాల కోసమే 29 కార్మిక చట్టాల స్థానంలో నాలుగు లేబర్ కోడ్లను కేంద్ర ప్రభుత్వం తెచ్చిందని తెలిపారు. ఆత్మనిర్భర్ పేరుతో మోడీ సర్కార్ బరితెగించి ఈ చర్యకు పూనుకున్నదని విమర్శించారు. నాలుగు లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా 2020 నుంచి 2025 జూలై 9 దేశవ్యాప్త సమ్మె వరకు ఐదేండ్లపాటు సమ్మెలు, పోరాటాలు జరిగాయని గుర్తు చేశారు. అయినా కోట్లాది మంది కార్మికుల నిరసనలను కేంద్రం పరిగణలోకి తీసుకో లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నవంబర్ 13న ఢిల్లీలో కేంద్ర కార్మిక సంఘాలు లేబర్ కోడ్లను అమలును నిలిపివేయాలని డిమాండ్ చేసినా ఖాతరు చేయలేదనీ, తద్వారా ఈ ప్రభుత్వం కార్పొరేట్ల ప్రయోజనాలకోసమే ఉన్నదని మరో సారి రుజువు చేసుకున్నదని గుర్తు చేశారు. లేబర్ కోడ్ల అమలుకు రూల్స్ నిర్ణయించడంతో యాజమాన్యాల దోపిడీకి అంతే లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో నాలుగు లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా రాష్ట్రంలోని యావత్ కార్మికులు సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.



