యువతను పూర్తిగా విస్మరించింది :డీవైఎఫ్ఐ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
యూనియన్ బడ్జెట్ 2026 దిశా నిర్దేశం లేనిదనీ, యువతను పూర్తిగా విస్మరించిందని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య(డీవైఎఫ్ఐ) తెలంగాణ రాష్ట్ర కమిటీ విమర్శించింది. ఈ మేరకు ఆదివారం రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేష్, రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి వెంకటేష్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ బడ్జెట్ పూర్తిగా ప్రజా, యువత, కార్మిక, సమాఖ్య వ్యవస్థకు వ్యతిరేకంగా బడ్జెట్ ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం కార్పొరేట్ ప్రయోజనాలను కాపాడుతూ సంక్షోభ భారాన్ని కార్మికులు, రైతులు, నిరుద్యోగ యువతపై మోపాలని ఎంచుకుందని తెలిపారు. దేశం ఎదుర్కొంటున్న అసలు సవాళ్లను ఈ బడ్జెట్ పరిష్కరించడంలో విఫలమైందని పేర్కొన్నారు. భద్రమైన ఉద్యోగాలను సష్టించేందుకు ఈ బడ్జెట్ ఎలాంటి స్పష్టమైన ప్రణాళికను చూపలేదని తప్పుపట్టారు.
ప్రభుత్వ రంగ ఉద్యోగాలను విస్తరించేందుకు ప్రతిపాదనలు లేవని తెలిపారు.
”విద్య నుంచి ఉపాధి, వ్యాపారం”పై శాశ్వత కమిటీ ఏర్పాటు ప్రతిపాదనలన్ని తప్పించుకునే ప్రయత్నాలు చేశారని తెలిపారు. గిగ్ కార్మికుల సంక్షేమం, చట్టపరమైన గుర్తింపు లేదా సామాజిక భద్రత కోసం బడ్జెట్లో ఎలాంటి నిధులు లేవని వారు విమర్శించారు. కార్మిక కోడ్లను అమలు చేస్తూ, నియంత్రణ ప్రమాణాలను సడలించడం ద్వారా ప్రభుత్వం అస్థిరతను సంస్థాగతం చేస్తూ యువ కార్మికుల హక్కులను హరిస్తోందని తెలిపారు. రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చే నిధులు తగ్గించడంతో రాష్ట్రాలు ఉద్యోగాలు, విద్య, ఆరోగ్యం వంటి రంగాల్లో ఖర్చు చేయడం కష్టమవుతోందని తెలిపారు. మొత్తానికి, ఈ బడ్జెట్ లో పరిష్కారాలకు బదులు నినాదాలు మాత్రమే ఉన్నాయని వారు వ్యతిరేకించారు. యువతను విస్మరించిన ఈ బడ్జెట్ను నిరసిస్తూ ఫిబ్రవరి 2న రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు.
దిశా నిర్దేశం లేని యూనియన్ బడ్జెట్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



