– బాయ్ఫ్రెండ్తో కలిసి యువతి డ్రగ్స్ దందా
– నలుగురు అరెస్ట్.. రూ.4 లక్షల మత్తు పదార్థాలు స్వాధీనం
నవతెలంగాణ-ముషీరాబాద్
హైదరాబాద్ చిక్కడపల్లి ప్రాంతంలో డ్రగ్స్ నెట్ వర్క్ గుట్టు రట్టయింది. బారుఫ్రెండ్తో కలిసి డ్రగ్స్ దందా నడుపుతున్న యువతితోపాటు మరో ఇద్దరిని చిక్కడపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి దాదాపు రూ.4 లక్షల మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. చిక్కడపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ ప్రాంతానికి చెందిన సుష్మిత హైదరాబాద్ నగరంలోని ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తోంది. లగ్జరీ జీవన శైలికి అలవాటు పడిన ఆమె తన బాయ్ ఫ్రెండ్ ఇమాన్యుయల్తో కలిసి యువతను టార్గెట్ చేసుకొని డ్రగ్స్ విక్రయిస్తోంది. చిక్కడపల్లి పరిధిలో గుట్టుగా సాగుతున్న ఈ అక్రమ వ్యాపారంపై పక్కా సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించి ప్రియురాలు, ప్రియుడితోపాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ఎండీఎంఏ డ్రగ్స్, ఎల్ఎస్డీ బాటిల్స్, ఓజీ కుష్ వంటి ఖరీదైన మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్ విలువ సుమారు రూ.4 లక్షల వరకు ఉండొచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. డ్రగ్స్ సరఫరా వెనుక మరెంత మంది ఉన్నారు, ఈ నెట్వర్క్ ఎంతవరకు విస్తరించిందన్న దానిపై పోలీసులు విచారణ చేపట్టారు. నగరంలో విద్యార్థులు, ఐటీ ఉద్యోగులే లక్ష్యంగా ఈ డ్రగ్స్ విక్రయాలు జరిగినట్టు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. వాట్సప్, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా యాప్లను ఉపయోగించి కస్టమర్లను సంప్రదించడం, హోమ్ డెలివరీ తరహాలో డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు, కాలేజీ విద్యార్థులే లక్ష్యంగా డీలింగ్ కొనసాగించినట్టు విచారణలో వెల్లడైంది. డ్రగ్స్ కొనుగోలు, అమ్మకాల లావాదేవీలను డిజిటల్ పేమెంట్స్ ద్వారా నిర్వహిస్తూ, పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నారని అధికారులు తెలిపారు. నిందితులకు డ్రగ్స్ సరఫరా చేసిన ప్రధాన డీలర్లు ఎవరు, నగరానికి మత్తుపదార్థాలు ఎలా చేరుతున్నాయన్న అంశాలపై విచారణ చేపట్టారు. డ్రగ్స్కు దూరంగా ఉండాలని, ఎవరైనా అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే వెంటనే తమకు సమాచారం అందించాలని పోలీసులు తెలిపారు.
చిక్కడపల్లిలో డ్రగ్స్ నెట్వర్క్ గుట్టురట్టు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



