ఆకలి బాధలు లేని హైదరాబాద్ లక్ష్యంగా
ఇందిరమ్మ క్యాంటీన్లు…మంత్రి పొన్నం ప్రభాకర్
గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా 150 ఇందిరమ్మ క్యాంటీన్లు : మేయర్ గద్వాల్ విజయలక్ష్మి
మోతీనగర్, ఖైరతాబాద్ మింట్ క్యాంపస్లో
ఇందిరమ్మ క్యాంటీన్ల ప్రారంభం
ఒక్కో వ్యక్తిపై నెలకు రూ.3 వేల మేర తగ్గనున్న ఆర్థిక భారం
నవతెలంగాణ-సిటీబ్యూరో
గరీబీ హటావో అనే నినాదంతో పేదరిక నిర్మూలనకు కృషి చేసిన ఇందిరమ్మ స్ఫూర్తితో ఆకలి బాధలు లేని హైదరాబాద్ లక్ష్యంగా ఇందిరమ్మ క్యాంటన్లు ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సోమవారం హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో కలిసి మోతీనగర్, ఖైరతాబాద్ మింట్ క్యాంపస్లో ఇందిరమ్మ క్యాంటీన్లను ప్రారంభించారు. లబ్దిదారులకు స్వయంగా అల్పాహారం వడ్డించారు. పారిశుధ్య కార్మికులు, లబ్దిదారులతో కలిసి మంత్రి, మేయర్ భోజనం చేశారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నగరంలో నూతనంగా 60వేలకుపైగా రేషన్ కార్డులను అందించామని తెలిపారు. ఇందిరమ్మ స్ఫూర్తిగా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఇందిరమ్మ క్యాంటీన్లను ప్రారంభించామని, ఇప్పటి నుంచి ఇందిరమ్మ క్యాంటీన్లలో అల్పాహారం రూ.5, భోజనం రూ.5కు లభిస్తుందని, జీహెచ్ఎంసీ ఒక్కో అల్పాహారంపై రూ.14, భోజనంపై రూ.24.83 వెచ్చిస్తోందని అన్నారు. ప్రతి లబ్దిదారునికి నెలకు సగటున సుమారు రూ.3 వేల వరకు ఆర్థిక ప్రయోజనం కలగనుందని తెలిపారు. హరే కృష్ణ హరే రామ ఫౌండేషన్ వీటి నిర్వహణ బాధ్యతలు చూస్తుందన్నారు. ఇందిరమ్మ క్యాంటీన్ల ద్వారా ఉదయం అందించే అల్పాహారం, మధ్యాహ్న భోజనంతో హైదరాబాద్లో పేదలు, అడ్డా కూలీలు, ఆటో డ్రైవర్లు, చిరు వ్యాపారులు, అల్పాదాయ వర్గాల వారు, నిరుద్యోగులకు ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. ప్రభుత్వానికి ఆర్థిక భారం పడుతున్నా పేదలకు నాణ్యమైన ఆహారం తక్కువ ధరకు అందించాలనే లక్ష్యంతోనే ఈ ఇందిరమ్మ క్యాంటీన్లను ప్రారంభించినట్టు చెప్పారు. ప్రభుత్వం అందించే ప్రయోజనాలను పొందేందుకు నగరంలోని మహిళలు.. మహిళా స్వయం సహాయక సంఘంలో సభ్యత్వం పొందాలని సూచించారు. అందరి సహకారంతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచుతున్నామని అన్నారు. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మాట్లాడుతూ.. పేదలకు, అల్పాదాయ వర్గాలకు ఇందిరమ్మ క్యాంటీన్లు ఎంతో ప్రయోజనకరమన్నారు. గ్రేటర్ హైదరాబాద్లో త్వరలో 150 ఇందిరమ్మ క్యాంటీన్లు ప్రారంభించబోతున్నామని తెలిపారు. మహిళలను ప్రోత్సహిస్తూ స్వయం సహాయక సంఘాలకు క్యాంటీన్లు కేటాయిస్తామని చెప్పారు. మింట్ క్యాంపస్లో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ క్యాంటీన్ అందరికీ చేరువగా ఉందని ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ అభిప్రాయపడ్డారు. ఇందిరమ్మ క్యాంటీన్ల నిర్వహణ బాధ్యతలను స్వయం సహాయక సంఘాలకు అప్పగించాలని ఎమ్మెల్యే దానం నాగేందర్ కోరారు. ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, జోనల్ కమిషనర్లు బోర్కడే హేమంత్ సహదేవ్ రావు, అనురాగ్ జయంతి, అదనపు కమిషనర్లు రఘు ప్రసాద్, పంకజ, స్థానిక కార్పొరేటర్లు పాల్గొన్నారు.
రూ.5కే కడుపునిండా భోజనం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES