– నింగికెగిసిన డ్రాగన్
– 28 గంటల తర్వాత రోదసీ స్టేషన్కు
– ప్రధాని మోడీ సహ పలువురి హర్షం
ఫ్లోరిడా : భారత రోదసీ చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. భారత వ్యోమగామి శుభాంశు శుక్లా సహా నలుగురు వ్యోమగాములను తీసుకుని డ్రాగన్ అంతరిక్ష నౌక రోదసీలోకి ప్రయాణం ఆరంభించింది. ఫ్లోరిడాలోని నాసా కెన్నడీ స్పేస్ సెంటర్ నుండి బుధవారం మధ్యాహ్నం 12.01 గంటలకు (భారత కాలమానం ప్రకారం) ఫాల్కన్ 9 రాకెట్ను విజయవంతంగా ప్రయోగించారు. దాదాపు 10 నిముషాల తర్వాత రాకెట్ నుండి డ్రాగన్ క్యాప్సుల్ విడిపోయి అంతరిక్ష స్టేషన్ దిశగా తన ప్రయాణం కొనసాగించింది. పలు అంతరాయాలు, జాప్యాల అనంతరం యాక్సిమ్ మిషన్ ప్రారంభమైంది. వాస్తవానికి మే 29నే ఈ ప్రయోగం జరగాల్సి వుంది. కానీ ఆరుసార్లు వాయిదాపడింది. బుధవారం కూడా ప్రయోగానికి కొద్ది నిముషాల ముందు సాఫ్ట్వేర్లో ఏదో సమస్య తలెత్తగా వెంటనే శాస్త్రవేత్తలు జోక్యం చేసుకుని సరిదిద్దడంతో ప్రయోగం సాఫీగా జరిగింది. దాదాపు 28గంటల ప్రయాణం అనంతరం వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్ఎస్)కు చేరుకుంటారు. భారత కాలమానం ప్రకారం గురువారం సాయంత్రం 4.30గంటలకు అంతరిక్ష నౌక ఐఎస్ఎస్తో డ్రాగన్ క్యాప్సుల్ అనుసంథానమవుతుంది.
31 దేశాలు…60 అధ్యయనాలు
ఈ మిషన్లో గ్రూపు కెప్టెన్ శుక్లా పైలట్గా వ్యవహరిస్తారు. మరో ముగ్గురు క్రూ మెంబర్స్ వుంటారు. వారు అమెరికాకు చెందిన కమాండర్ పెగ్గి విట్సన్, పోలెండ్కి చెందిన మిషన్ స్పెషలిస్ట్ స్లావోజ్ ఉజన్స్కి, హంగేరికి చెందిన మిషన్ స్పెషలిస్ట్ తిబూర్ కపు. మొత్తంగా 31 దేశాలకు ప్రాతినిధ్యం వహించే 60 శాస్త్రీయ అధ్యయనాలు, కార్యకలాపాలపై ఎఎక్స్-4 బృందం పరిశోధనలు జరపనుంది. ఈ దేశాల్లో భారత్, అమెరికా, పోలెండ్, హంగేరి, సౌదీ అరేబియా, బ్రెజిల్, నైజీరియా, యుఎఇ, ఇంకా పలు యూరప్ దేశాలు వున్నాయి. నాసా నిర్వహించనున్న ఐదు ఉమ్మడి అధ్యయనాల్లో కూడా శుభాంశు పాల్గొంటారు.
41ఏండ్ల అనంతరం
దాదాపు 41ఏండ్ల తర్వాత భారత వ్యోమగామి అంతరిక్షంలో గడపబోతు న్నారు. గతంలో 1984లో సోవియట్ యూనియన్కి చెందిన సోయుజ్ అంతరిక్ష నౌకలో రాకేష్ శర్మ అంతరిక్షం లోకి వెళ్ళగా ఇప్పుడు శుభాంశు శుక్లా రెండో భారతీయుడుగా చరిత్ర సృష్టించారు.
ఈ త్రివర్ణపతాకం చెబుతోంది...
ప్రయాణం ఆరంభించగానే శుభాంశు శుక్లా మొదటి సందేశం పంపుతూ, ”నా దేశ ప్రజలకు నమస్కారాలు. 40ఏళ్ళ తర్వాత మనం మళ్ళీ రోదసీలోకి వెళుతున్నాం. ఇది చాలా అద్భుతమైన ప్రయాణం. నేను ఒంటరిని కానని, నాతోపాటు మీరందరూ వున్నారని నా భుజస్కంధాలపై వున్న ఈ త్రివర్ణ పతాకం నాకు చెబుతోంది.” అని ఆయన ఉద్వేగంగా వ్యాఖ్యానించారు.
ఇది తన ప్రయాణం కాదని, భారత మానవ సహిత రోదసీ కార్యక్రమానికి నాంది అని పేర్కొన్నారు. ఈ ప్రయాణంలో నా దేశ ప్రజలందరినీ భాగస్వాములను చేయాలనుకుంటున్నాను. మనందరం కలిసి భారత మానవ సహిత రోదసీ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. జై హింద్, జై భారత్” అని వ్యాఖ్యానించారు.
భారతీయుల ఆశలు మోసుకుని…
ప్రధాని ప్రభృతుల ఆనందం
140కోట్లమంది భారతీయుల ఆశలను మోసుకుని శుభాంశు శుక్లా రోదసీలోకి వెళ్ళారని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. ఈ ప్రయోగం విజయవంతం కావాలని ఆయన ఆకాంక్షించారు. డ్రాగన్ రోదసీలోకి దూసుకెళ్ళగానే ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్లో పోస్టు పెట్టారు. శుక్లాను చూసి భారత్ గర్వపడుతోంది రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. దేశ చరిత్రలో ఇదొక కీలకమైన మైలురాయి అని పేర్కొన్నారు.
తల్లి భావోద్వేగం
భారత అంతరిక్ష చరిత్రలో నిలిచిపోయే ఘట్టం ఆవిష్కృతమవుతున్న వేళ భారత వైమానికదళ అధికారి, వ్యోమగామి శుభాంశు శుక్లా తల్లి ఆశా శుక్లా భావోద్వేగానికి గురయ్యారు. ఆయనతండ్రి శంభు దయాళ్ శుక్లా స్పందిస్తూ ఇది తన జీవితంలో అత్యంత ఆనందకరమైన రోజని వ్యాఖ్యానించారు. ఇలాంటి బిడ్డకు తండ్రి కావడం అదృష్టమన్నారు.
14 రోజుల్లో ఇస్రో ఏడు ప్రయోగాలు
అంతరిక్ష కేంద్రంలో శుభాంశు శుక్లా బృందం 14రోజుల పాటు వుంటుంది. ఈ సమయంలో సైన్స్, వాణిజ్య కార్యకలాపాలపై పరిశోధనలు, ప్రయోగాలు నిర్వహిస్తారు. ఇస్రో తరపున మొత్తంగా ఏడు ప్రయోగాలు నిర్వహించనున్నారు. సుదీర్ఘకాలం రోదసీ యాత్రలు జరిపే సమయంలో తీసుకోవాల్సిన పోషకాహారం, ప్రాణాధార వ్యవస్థల విషయంలో పురోగతి సాధించడానికి ఉద్దేశించిన ప్రయోగం కూడా ఇందులో వుంది. రోదసీలో భార రహిత స్థితిలో తేలియాడే సమయంలో శరీరంలోని ఎముకలు, గుండె కండరాలు, రోగ నిరోధక వ్యవస్థ, రక్త నాళాలపై వుండే ప్రభావాలపై కూడా వీరు పరిశోధనలు జరుపుతారు.
భారతీయుల కలలు మోసుకుని ‘శుభా’రంభం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES