నవతెలంగాణ-హైదరాబాద్: తెలంగాణ పంచాయతీ రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్లను హైకోర్టు ఈ రోజు విచారించనుంది. బీసీ జనాభా శాతం మేరకు రిజర్వేషన్లు కేటాయించలేదన్న ఆరోపణలతో పలువురు అభ్యర్థులు కోర్టు ఆశ్రయించారు. కల్వకుర్తి నియోజకవర్గంలోని వెల్దండ మండల తిమ్మనోనిపల్లి గ్రామ రిజర్వేషన్లపై ఒక పిటిషన్ దాఖలైంది. గ్రామంలోని అన్ని వార్డులను ఎస్సీ, ఎస్టీ వర్గాలకే కేటాయించారని, కానీ అక్కడ బీసీ జనాభా ఎక్కువగా ఉందని పిటిషనర్ పేర్కొన్నారు. ఇది సామాజిక న్యాయానికి విరుద్ధమని వాదిస్తున్నారు. ఇక సంగారెడ్డి జిల్లాలోని కొన్ని గ్రామాలకు సంబంధించిన రిజర్వేషన్ కేటాయింపులను సవాల్ చేస్తూ మరో పిటిషన్ హైకోర్టు ఎదుట ఉంది. మొత్తం మీద, రాష్ట్ర ఎన్నికల షెడ్యూల్ నడుమ ఈ కేసులు కీలకంగా మారాయి. హైకోర్టు విచారణతో రిజర్వేషన్ విధానంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
మరోవైపు గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ అధికారికంగా ప్రారంభం కావడంతో రాష్ట్రం మొత్తం ఎన్నికల వాతావరణంలోకి ప్రవేశించింది. సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ నేటితో ప్రారంభమవుతుంది. 30న నామినేషన్ల పరిశీలన, సాయం త్రం బరిలో నిలిచిన అభ్యర్థులతో కూడిన తుది జాబితాను ప్రకటించనున్నారు.



