పెద్దఎత్తున నేలకొరిగిన చెట్లు, పంటలు
నవతెలంగాణ-మహదేవపూర్
ప్రకృతి బీభత్సానికి జయశంకర్-భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ ఉమ్మడి మండలంలోని లెంకలగడ్డ గోదావరి అటవీ ప్రాంతంలో చెట్లు, మిర్చి, పత్తి పంటలకు భారీ నష్టం వాటిల్లింది. మంగళవారం సాయంత్రం లంకలగడ్డ సమీపంలోని గోదావరి వద్ద ఒక్కసారిగా సుడిగాలి బీభత్సం సృష్టించింది. సుమారు 4గంటలపాటు గాలి రావడంతో అటవీ ప్రాంతంలో చెట్లు నేలకొరిగాయి. వందల ఎకరాల్లో పత్తి, మిర్చి పంటలకు నష్టం వాటిల్లింది. చెట్లు కూకటివేళ్లతో పడిపోయాయి. కొన్ని విరిగిపోయాయి. ఈ సందర్భంగా పలిమెల రేంజ్ ఆఫీసర్ నాగరాజు మాట్లాడుతూ.. లెంకలగడ్డ సమీపంలో అటవీ ప్రాంతంలో 1213 ఎకరాల్లో సుమారు 200 చెట్లు పడిపోయాయని తెలిపారు. సర్వే చేసి ఎన్ని చెట్లు విరిగాయి..? ఎంత నష్టం జరిగిందనే వివరాలు చెబుతామని తెలిపారు. గత సంవత్సరం మేడారం అడవుల్లో కూడా కొన్ని వేల చెట్లు నేలకొరిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం లెంకలగడ్డ గోదావరి సమీపంలో భారీ సుడిగాలి బీభత్సం జరగడంతో రైతులు, ప్రజలు భయాందోళనకు గురయ్యారు.



