రెండు లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి
సిటీ సెంట్రల్ లైబ్రరీ వద్ద నిరుద్యోగుల మెరుపు ధర్నా
అడ్డుకున్న పోలీసులు..20 మంది అరెస్ట్
పోలీస్ పహారాలో అశోక్నగర్
నవతెలంగాణ – ముషీరాబాద్
జాబ్ క్యాలెండర్ విడుదల చేయడంతోపాటు రెండు లక్షల ఉద్యోగాలను ప్రభుత్వం వెంటనే భర్తీ చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు. గురువారం హైదరాబాద్ అశోక్నగర్లోని సిటీ సెంటర్ లైబ్రరీ వద్ద వారు మెరుపు ధర్నా నిర్వహించారు. ఈ క్రమంలో నిరుద్యోగులను పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వివరాల్లోకెళ్తే.. గురువారం సాయంత్రం సిటీ సెంటర్ లైబ్రరీ నుంచి అశోక్నగర్ చౌరస్తా వరకు భారీ సంఖ్యలో నిరుద్యోగులు, విద్యార్థులు గుంపులుగా ర్యాలీగా బయలుదేరారు. ఈ ర్యాలీ అశోక్నగర్ ప్రాంతానికి చేరుకోగానే పోలీసులు అప్రమత్తమై వారిని ఎక్కడికక్కడ చెదరగొట్టారు. అయినా.. వారి నుంచి తప్పించుకుని నిరుద్యోగులు ధర్నాకు దిగడంతో పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకొని పోలీస్స్టేషన్కు తరలించారు. దాంతో ఒక్కసారిగా అశోక్నగర్ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఏ సమయంలోనైనా విద్యార్థులు, నిరుద్యోగులు మళ్లీ పెద్దఎత్తున ఆందోళన చేసే అవకాశం ఉండటంతో అశోక్నగర్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు మోహరించారు.



