ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి
మహిళా కార్మికులకు ఐద్వా సంఘీభావం
నవతెలంగాణ-సిటీబ్యూరో
షాహి గార్మెంట్ కంపెనీలో పని చేస్తున్న మహిళలకు కనీస వేతనం రూ.15వేలివ్వాలని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి డిమాండ్ చేశారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా నాచారం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న షాహి గార్మెంట్ కంపెనీలో పని చేస్తున్న మహిళలు తమకు కనీస వేతనం రూ.15వేలకు పెంచాలని 9 రోజులుగా కంపెనీ ఎదుట కూర్చుని నిరసన తెలియజేస్తున్నారు. ఐద్వా మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అధ్యక్ష, కార్యదర్శి ఎం.సృజన, ఎం.వినోదతో కలిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లకిë మంగళవారం వారికి సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 9 రోజులుగా మహిళలు కనీస వేతనం కోసం సమ్మె చేస్తుంటే కంపెనీ యాజమాన్యానికి చీమకుట్టినట్టు కూడా లేదని విమర్శించారు. కంపెనీలో పని చేస్తున్న మహిళలను సూపర్వైజర్లు వేధించడం, వాష్ రూంకి వెళ్తే తిట్టడం ఎంత మాత్రం సమంజసం కాదన్నారు. మహిళలు పని చేస్తున్న కంపెనీలో లైంగిక వేధింపుల కమిటీ ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనం రూ.15వేలివ్వాలని డిమాండ్ చేశారు.



