దు:ఖాన్ని రాజకీయ ప్రతిఘటనగా మార్చిన సబీనా యాస్మిన్
టీఎంసీ విజయోత్సవంలో బాంబుదాడిలో మరణించిన యాస్మిన్ కూతురు
కోల్కతా : సబీనా యాస్మిన్ అనే సాధారణ గృహిణి. తన పదేండ్ల కూతురు హత్య తర్వాత న్యాయం కోసం పోరాటం చేస్తూ ఇప్పుడు పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో అభ్యర్థిగా నిలబడి ప్రజలను మార్పు కోసం ఆహ్వానిస్తోంది.
రాజకీయ రంగంలోకి ప్రవేశం
సబీనా యాస్మిన్ ఇప్పుడు సీపీఐ(ఎం) తరఫున కలిగంజ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ”నేను సానుభూతితో ఓట్ల కోసం రాలేదు. ప్రజలు భయంతో జీవిస్తున్నారు. ఈ ఎన్నికలు మార్పునకు అవకాశం” అని ఆమె అన్నారు. తమన్నా హత్య కేసులో 24 మంది నిందితుల్లో 14 మంది ఇంకా దొరకలేదు. వాళ్లు ఇంకా బయటే తిరుగుతున్నారనీ, పోలీసుల పని తీరుపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ పరిస్థితి ప్రజల్లో ఆగ్రహాన్ని పెంచింది. ”పాలక పార్టీ కార్యకర్తలు ప్రజలను భయపెడుతున్నారు. ఓటు వేయకపోతే ప్రభుత్వ పథకాలు ఆపేస్తామని బెదిరిస్తున్నారు. ఇది ప్రజలు డబ్బు. ఎవరూ ఆపలేరు” అని యాస్మిన్ ఆరోపించారు.
ఆమె ఎన్నికల ప్రచారానికి ప్రజల నుంచి మంచి మద్దతు లభిస్తోంది. ప్రతి రోజూ ఉదయం నుంచే గ్రామాలకు వెళ్లి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆమె భర్త, పార్టీ కార్యకర్తలతో కలిసి ఇంటింటికీ వెళ్తున్నారు. చాలా మంది మహిళలు ఆమెను చూసి భావోద్వేగానికి గురవుతున్నారు. సబీనా యాస్మిన్ తన కూతురిని గుర్తు చేసుకుంటూ… ” నా కూతురు నాకు బలం. ఆమె కోసం పోరాడతా. నేను ఇప్పుడు చేసే పోరాటం నా కూతురి కోసం మాత్రమే కాదు.. సమాజంలో భయాన్ని తొలగించడానికి.. పేదల హక్కుల కోసం.. రాజకీయ హింసకు వ్యతిరేకంగా..” అని ఆమె చెప్పారు.
ఏం జరిగింది?
పశ్చిమ బెంగాల్లోని నాదియా జిల్లాలో కలిగంజ్ ప్రాంతంలో ఒక హృదయ విదారక ఘటన జరిగింది. గతేడాది జూన్ 23న అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) విజయోత్సవంలో భాగంగా జరిగిన బాంబు దాడిలో పదేండ్ల తమన్నా ఖతూన్ మరణించింది. ఈ ఘటన తర్వాత ఆమె తల్లి సబీనా యాస్మిన్ తీవ్ర దు:ఖంలో ఉంది. అయినప్పటికీ.. న్యాయం కోసం పోరాటం ప్రారంభించింది. ”నా కూతురి హత్యకు కారణమైన వాళ్లకు శిక్ష పడాలి. ప్రజలు ఓటుతోనే వారికి తీర్పు చెప్పాలి” అని ఆమె అన్నారు.
బెంగాల్ ఎన్నికల్లో ఓ తల్లి పోరాటం
- Advertisement -
- Advertisement -



