తెలుగు రాష్ట్రాల్లో బహుభాషా ప్రవీణులు అనేక మంది ఉన్నారు. మాజీ పీవీ నర్సింహారావు 14 భాషల్లో దిట్ట అయితే.. సీపీఐ(ఎం) మాజీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తెలుగు, హిందీ, ఇంగ్లీషు, మళయాళం, బెంగాలీ తెలిసిన నేత. మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు తెలుగుతోపాటు హిందీ, ఇంగ్లీషుల్లో యాస, ప్రాసలతో అదరగొడతారు. మాజీ సీఎం కేసీఆర్ గురించి చెప్పనవసరమే లేదు. తెలంగాణ జనం భాషను బహుబాగా ఆకళింపు చేసుకున్న ఆయన వేసే రాజకీయ సెటైర్లకు, వ్యంగ్యాస్త్రాలకు సభికులు పడీపడీ నవ్వాల్సిందే. వీరందరూ తెలుగువారు కావటం మనందరికీ గర్వకారణం. తెలుగు భాషపై వారికున్న మమకారం అపారం.
కానీ ఇప్పుడు ఆ తెలుగుకు తెగులొచ్చిందంటున్నారు సాహితీవేత్తలు. కేరళ, తమిళనాడు, కర్నాటక, ఒరిస్సా ప్రభుత్వాలు అక్కడి మాతృభాషలోనే పాఠ్యాంశాలను బోధిస్తోంటే.. తెలుగు మాద్యమాన్ని పూర్తిగా రద్దుచేసి, ఇంగ్లీషు మీడియాన్ని ముద్దాడటం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కే దక్కిందని భాషా ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోనీ కనీసం మన పిల్లలు ఆంగ్ల మాద్యమంలోనైనా ప్రావీణ్యం సంపాదిస్తున్నారా? అంటే అదీ లేదు. ఈ రకంగా ఇటు తెలుగుపై పట్టు లేక, అటు ఇంగ్లీషు కూడా చదవటం రాక.. ఎటూ కాకుండా పోతున్నారన్నది ఉపాధ్యాయుల ఆక్రందన. దీనికి ఎక్కడో ఏదో ఒక పరిష్కారం వెతకాలి..లేదంటే మన విద్యార్థుల భవిష్యత్తు… ‘జంబలకిడిపంబ…’ కావటం ఖాయం…
-బి.వి.యన్.పద్మరాజు
తెలుగుకు తెగులు…
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



