49 మంది మృతి
మాస్కో: రష్యాకు చెందిన ఏఎన్-24 విమానం రాడార్ నుంచి సంబంధాలు తెగిపోయి చైనా సరిహద్దుల్లోని తూర్పు ప్రాంతంలో కూలిపోయింది. ప్రమాద సమయంలో విమానంలో దాదాపు 49 మంది వరకు ప్రయాణికు లు ఉన్నారని తెలుస్తోంది. తొలుత విమానం అదృశ్యమైనట్టు వార్తలు రాగా, కాసేపటి క్రితమే కూలిపోయిందని అధికారులు నిర్ధరించారు. రష్యన్ వార్తా కథనాల ప్రకారం, గురువారం తెల్లవారుజామున 49 మంది ప్రయాణికులతో వెళ్తున్న రష్యా విమానం తొలుత అదృశ్యమయ్యింది. సైబీరియా చెందిన అంగారా ఎయిర్లైన్స్ ఏఎన్-24 విమానం బ్లాగోవెష్చెన్స్క్ నుంచి చైనా సరిహద్దుల్లో ఉన్న టిండా ప్రాంతానికి బయల్దేరింది. మరికొద్దిసేపట్లో ల్యాండింగ్ అయ్యే సమయానికి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లతో విమనానికి సంబంధాలు తెగిపోయాయి. దీంతో అప్రమత్తమైన యంత్రాంగం వెంటనే ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టింది. అదృశ్యమైన కొద్దిసేపటికే రష్యా అత్యవసర పరిస్థితుల మంత్రిత్వ శాఖ విమానం ”కాలిపోతున్న ఫ్యూజ్లేజ్”ను కనుగొన్నట్టు తెలిపింది. అయితే ఆ విమానం ల్యాండ్ అయ్యేందుకు 15 కిలోమీటర్లు దూరంలో ఉండగా కూలిపోయినట్టు అధికార వర్గాలు తెలిపాయి.
సహాయక చర్యల్లో పాల్గొన్న రెస్క్యూ సిబ్బంది
చైనా సరిహద్దుల్లోని టిండా విమానాశ్రయానికి చేరువలోనే విమాన ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో విమానంలో ఐదుగురు పిల్లలు, ఆరుగురు సిబ్బందితో సహా 43 మంది ప్రమాణికులు ఉన్నారని రష్యన్ మీడియా కథనాలు తెలిపాయి. సహాయ చర్యల కోసం ప్రత్యేక దళాలను ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. కాగా, ఘటనాస్ధలంలో భారీగా మంటలు చెలరేగాయి. రెస్క్యూ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని సహయక చర్యల్లో పాల్గొన్నారు. విమానం తొలుత ల్యాండింగ్కు ప్రయత్నించగా అది విఫలం కాగా, మరోసారి ల్యాండింగ్ చేసేటపుడు ప్రమాదానికి గురైనట్టు తెలుస్తోంది. కాగా ఈ ప్రమాదంలో ఎవరూ బతికే అవకాశం లేదని రష్యా వార్తా కథనం ఒకటి ప్రకటించింది. ఘటనాస్థలిలో విమాన శకలాలకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. పైలట్ తప్పిదం లేదా ల్యాండింగ్ సమయంలో వాతావరణం అనుకూలించకపోవడమే ప్రమాదానికి కారణం కావచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత సంవత్సరం సెప్టెంబర్లో ముగ్గురు వ్యక్తులతో వెళ్తున్న రాబిన్సన్ ఆర్ 66 హెలికాప్టర్ ఇదే అమూర్ ప్రాంతంలో అదృశ్యమైంది. ఈ ప్రాంతం మాస్కోకు తూర్పున దాదాపు 6,600 కి.మీ దూరంలో ఉంది.
రష్యాలో కుప్పకూలిన విమానం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES