టీపీఎస్కే, ఎస్వీకే ఆధ్వర్యంలో నిర్వహించనున్న ‘కుల నిర్మూలన సాంస్కృతిక ఉత్సవాలు’ సందర్భంగా కవి సమ్మేళనం
నవతెలంగాణ- ముషీరాబాద్
కులమతాల అడ్డుగోడలను కూల్చి మానవత్వాన్ని ప్రోత్సహించే దిశగా కవి సమ్మేళనం నిర్వహించామని కవి యాకూబ్ తెలిపారు. ఈ నెల 11వ తేదీ నుంచి సుందరయ్య విజ్ఞాన కేంద్రం(ఎస్వీకే), తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం (టీపీఎస్కే) సంయుక్తంగా నిర్వహించనున్న ”కుల నిర్మూలన సాంస్కృతిక ఉత్సవాలు’ సందర్భంగా ఆదివారం టీపీఎస్కే రాష్ట్ర అధ్యక్షులు భూపతి వెంకటేశ్వర్లు అధ్యక్షతన కవి సమ్మేళనం నిర్వహించారు. దీనికి 65 మంది కవులు పాల్గొని తమ కవితలను వినిపించారు. ఈ సందర్భంగా కవి యాకూబ్ మాట్లాడుతూ.. కులమత రహిత సమాజ నిర్మాణానికి ఇది ఒక ఆరంభమని తెలిపారు. సమానత్వ సమాజ స్థాపన కోసం ప్రతి ఒక్కరూ కట్టుబడి పనిచేయాల్సిన అవసరముందన్నారు.
సుందరయ్య విజ్ఞాన కేంద్రం కార్యదర్శి ఎస్. వినయ కుమార్ మాట్లాడుతూ.. కుల వ్యవస్థను ప్రశ్నించే కవిత్వం అవసరమన్నారు. కవుల అక్షరాలు సమాజ మార్పుకు ఆయుధాలుగా మారాలని సూచించారు. తెలంగాణ సాహితి కార్యదర్శి కె. ఆనందాచారి మాట్లాడుతూ.. కుల వ్యవస్థ పునాదులపై సమాజ నిర్మాణం సాధ్యం కాదన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆలోచనలను కవులు, కళాకారులు ముందుకు తీసుకెళ్లాలన్నారు. ఎస్కే సలీమా మాట్లాడుతూ.. కవిత్వం కేవలం పదాల సమాహారం కాకుండా సమాజాన్ని మేల్కొలిపే శక్తిగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గుప్త జ్యోత్స్న, మౌనం, మల్లిక్ మాస్టర్ జీ, వనపట్ల సుబ్బయ్య, సాధనాల వెంకటస్వామి నాయుడు, జనజ్వాల జి. యాదగిరిరావు, పుష్యమి సాగర్, గొర్ల బుచ్చన్న, రచన సాహు, రేణుక, నాంపల్లి సుజాత, ముజాయుద్దీన్, సందీప్ ఓటారికల్, మోహనకృష్ణ, మహేష్ దుర్గే, అత్తులూరి విజయలక్ష్మి, శ్రీధర్ గాజుల తదితరులు పాల్గొన్నారు.



