Thursday, June 12, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుప్రపంచానికి ఎర్రజెండే దిక్సూచి

ప్రపంచానికి ఎర్రజెండే దిక్సూచి

- Advertisement -

పేదలు, కార్మికుల పక్షాన నిలబడి కొట్లాడుతుంది
రఘుపాల్‌ సంస్మరణ సభలో
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ-జనగామ

రాబోయే రోజుల్లో ప్రపంచానికి ఎర్రజెండే దిక్సూచిగా మారనుందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. కమ్యూనిస్టు పార్టీ సీనియర్‌ నేత, సీపీఐ(ఎం) హైదరాబాద్‌ జంట నగరాల మాజీ కార్యదర్శి, సీఐటీయూ నేత గంగసాని రఘుపాల్‌ సంస్మరణ సభ మంగళవారం జనగామ జిల్లా కేంద్రంలోని సాయిరాం ఫంక్షన్‌ హాల్‌లో ఆ పార్టీ జనగామ జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ముందుగా రఘుపాల్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రఘుపాల్‌పై సాంబరాజు యాదగిరి రాసిన పాటల సీడీని జూలకంటి రంగారెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, సీపీఐ(ఎం) సీనియర్‌ నాయకులు సూడి కృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సీహెచ్‌ రాజారెడ్డి, అతని కుమారుడు డాక్టర్‌ గోపాల్‌రెడ్డితో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జూలకంటి మాట్లాడుతూ.. నిత్య కమ్యూనిస్టు యోధుడు రఘుపాల్‌ ఒక వ్యక్తి కాదని.. కమ్యూనిస్టు శక్తి అని కొనియాడారు. ధనిక కుటుంబంలో జన్మించిన రఘుపాల్‌ ఆస్తిపాస్తులను వదిలిపెట్టి ఎర్రజెండాను చేతపట్టారని తెలిపారు. ఆయన జీవితమంతా నిస్వార్ధంగా ప్రజల పక్షాన పోరాడి సమస్యల పరిష్కారం కోసం కృషి చేసినట్టు చెప్పారు. జనగామ ప్రాంతంలో జరిగిన ప్రజా ఉద్యమాల్లో ముఖ్యమైన పాత్ర పోషించడమే కాకుండా హైదరాబాద్‌ నగరానికి సుమారు రెండు దశాబ్దాల పాటు కార్యదర్శిగా పని చేసి పార్టీని నిర్మించారన్నారు. పార్టీ పత్రిక అయిన ప్రజాశక్తి అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషించారని అన్నారు. నమ్మిన కమ్యూనిస్టు సిద్ధాంతం కోసం చివరిదాకా పోరాటం చేసిన రఘుపాల్‌.. ఆశయాలను కొనసాగించడమే ఆయనకిచ్చే అసలైన నివాళి అని తెలిపారు.
కమ్యూనిస్టు పోరాటాలకు మద్దతిస్తాం : ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి
ప్రజా సమస్యలపై కమ్యూనిస్టులు నిర్వహిస్తున్న ప్రజా పోరాటాలకు బీఆర్‌ఎస్‌ మద్దతుగా నిలుస్తుందని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. రఘుపాల్‌తో విద్యార్థి దశలో తనకున్న అనుభవాలను పంచుకున్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట పటిమను పుణికి పుచ్చుకున్న దొడ్డి కొమురయ్య, ఐలమ్మల వారసత్వంగా ఉన్న జనగామ జిల్లా రఘునాథ్‌పల్లి మండలం గబ్బెట గ్రామానికి చెందిన రఘుపాల్‌ కమ్యూనిస్టు పార్టీలో ఉంటూ ఎంతోమందికి సేవ లు అందించారన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎర్రజెండాకు గులాబీ జెండా అండగా ఉంటుందన్నారు.
కమ్యూనిజమే ఊపిరిగా బతికాడు
తన తండ్రి గంగసాని రఘుపాల్‌ రెడ్డి కమ్యూనిజమే ఊపిరిగా బతికారని ఆయన కుమారుడు గంగసాని గోపాల్‌ రెడ్డి అన్నారు. తన తండ్రి భౌతికకాయాన్ని ఆయన కోరిక మేరకు మెడికల్‌ విద్యార్థులకు అప్పజెప్పడం సంతోషంగా ఉందన్నారు. తన తండ్రి ఆశయాల సాధన కోసం తమ వంతు కృషి చేస్తానన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సీహెచ్‌ రాజారెడ్డి మాట్లాడుతూ.. కమ్యూనిస్టు పార్టీల పోరాటాల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి, పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాపర్తిరాజు, ఇర్రి అహల్య, సాంబరాజు యాదగిరి, సింగారపు రమేష్‌, బొట్ల శేఖర్‌, జిల్లా కమిటీ సభ్యులు బూడిద గోపి, జోగు ప్రకాష్‌, సుంచు విజయేందర్‌, చందునాయక్‌, బెల్లంకొండ వెంకటేష్‌, పుత్కనూరు ఉపేందర్‌, బి గణేష్‌, బోడ నరేందర్‌, చిట్యాల సోమన్న, మునిగల రమేష్‌, మండల కార్యదర్శి గంగాపురం మహేందర్‌, రఘుపాల్‌ కుటుంబ సభ్యులు డాక్టర్‌ గోపాల్‌ రెడ్డి, లక్ష్మి, శ్రీనివాస్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
– రఘుపాల్‌ తనయుడు గోపాల్‌రెడ్డి

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -