తీవ్ర విషాదంలో కుటుంబ సభ్యులు
నవతెలంగాణ – ఆర్మూర్
ఆలూర్ మండల కేంద్రానికి చెందిన కుర్మే చిన్న రాజేష్ (45) ఇరాక్లో దురదృష్టవశాత్తు మరణించినట్టు సొసైటీ మాజీ చైర్మన్ కళ్లెం బోజరెడ్డి శనివారం తెలిపారు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు కష్టంగా ఉండటంతో జీవనోపాధి కోసం కొన్ని సంవత్సరాల క్రితం ఇరాక్కు వెళ్లిన రాజేష్ అక్కడ కూలీగా పనిచేస్తున్నారు. అయితే అక్కడే అనుకోకుండా మృతి చెందగా ఆయన కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఆయనకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈ ఘటన తెలిసిన వెంటనే ఆలూరులో శోకసంద్రం అలుముకుంది.
మృతదేహాన్ని స్వదేశానికి రప్పించే చర్యలు తీసుకోవాలని స్థానిక నాయకులు కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి వినయ్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డిని కోరగా ..వెంటనే స్పందించిన వినయ్ రెడ్డి, భూపతి రెడ్డి సంయుక్తంగా ఇరాక్ ప్రభుత్వానికి వినతిపత్రం పంపించారు. స్థానికులు ప్రభుత్వం రాజేష్ కుటుంబానికి తక్షణ సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలు ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.



