సీబీఐ లేదా న్యాయ విచారణ జరపాలి
బీఆర్ఎస్వీ ఉపాధ్యక్షులు తుంగబాలు డిమాండ్
పాఠశాల విద్యాశాఖ కార్యాలయం వద్ద ధర్నా
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అవినీతి పాలన కొనసాగుతోందని బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షలు తుంగబాలు ఆరోపించారు. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు (కేజీబీవీ) బంకర్ బెడ్ల టెండర్లలో సుమారు రూ.100 కోట్ల కుంభకోణం జరిగిందన్నారు. దీనిపై సీబీఐ లేదా న్యాయ విచారణ జరపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేజీబీవీ టెండర్లను రద్దు చేయాలని కోరుతూ గురువారం హైదరాబాద్లోని పాఠశాల విద్యాశాఖ సంచాలకుల కార్యాలయం వద్ద బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గెలు శ్రీనివాస్యాదవ్ సహా పలువురు నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సమయంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసుల అత్యుత్సాహంతో బీఆర్ఎస్వీ నాయకులు శ్రీకాంత్ ముదిరాజ్ చేతికి గాయమైంది. ఆయన్ను స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు.
ఈ సందర్భంగా తుంగ బాలు మాట్లాడుతూ పేద, దళిత, గిరిజన, వెనుకబడిన వర్గాల బాలికల విద్య, భద్రత, భవిష్యత్తును పణంగా పెట్టి కేజీబీవీలను అవినీతికి అడ్డాగా కాంగ్రెస్ ప్రభుత్వం మార్చిందని విమర్శించారు. టెండర్ల కేటాయింపులో పారదర్శకత లేకుండా, నిబంధనలను పూర్తిగా ఉల్లంఘిస్తూ, అధికార పార్టీకి అనుబంధంగా ఉన్న కాంట్రాక్టర్లకే రూ.కోట్ల పనులు కట్టబెట్టారని ఆరోపించారు. భోజన సరఫరా, హాస్టల్ వసతులు, ప్రతి అంశంలోనూ నాణ్యత లేని సరుకులతో బాలికల ఆరోగ్యం, విద్య తీవ్రంగా దెబ్బతింటోందని అన్నారు. కేజీబీవీ టెండర్లలో రూ.100 కోట్ల కుంభకోణంపై సీబీఐ లేదా హైకోర్టు పర్యవేక్షణలో న్యాయ విచారణ జరిపించి, భాగస్వాములైన ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు, కాంట్రాక్టర్లందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.



