Monday, February 23, 2026
E-PAPER
Homeసినిమాపవన్‌ వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించే పాట

పవన్‌ వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించే పాట

- Advertisement -

పవన్‌ కళ్యాణ్‌ కథానాయకుడిగా, హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’. మార్చి 26న థియేటర్లలో రిలీజ్‌ కానుంది. దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన తొలి గీతం ‘దేఖ్‌లేంగే సాలా’ విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ సినిమా నుంచి రెండవ గీతంగా ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విడుదలైంది. ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ్‌లో ఈ గీతావిష్కరణ వేడుక ఘనంగా జరిగింది. దర్శకుడు హరీష్‌ శంకర్‌ మాట్లాడుతూ, ‘ఈ పాటకు ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ అని ఏ ముహూర్తాన పెట్టామో.. ఇక్కడున్న ప్రతి ఒక్కరిలో ఆ ఆరా కనిపిస్తుంది. ‘నేను మెడ ముట్టుకుంటే, తొడ కొట్టినట్టే’. సినిమాలో ఒక సన్నివేశంలో ఈ డైలాగ్‌ వస్తుంది. పవన్‌ కళ్యాణ్‌ రెండు దశాబ్దాల నుంచి ఈ మేనరిజమ్‌ చేస్తున్నారు. దీనికి మాట రూపంలో చెప్తే బాగుంటుంది అనిపించింది. ఆ ఆలోచన నుంచి ఈ డైలాగ్‌ వచ్చింది.

ఆ మాటను హుక్‌ లైన్‌గా తీసుకొని మంచి పాటగా మలిచాం. ఆ ఆరాకి ఖచ్చితంగా ఆస్కార్‌ కలమే కావాలి అనిపించింది. వెంటనే చంద్రబోస్‌ని కలిసి ఈ పాట గురించి చెప్పాం. కేవలం ఎనిమిది గంటల్లో పాట సిద్ధమైంది. ఇది పవన్‌ కళ్యాణ్‌ మీద అభిమానంతో వచ్చిన పాట కాదు. ఆయన మీద అవగాహనతో రాసిన పాట. ఏ లైన్‌ విన్నా పవన్‌ కళ్యాణ్‌ గుర్తుకొస్తారు. ఈ పాటలోని ‘మెత్తని మట్టిలో మొలిచిన మొలకవు కాదోరు నువ్వు.. బండరాళ్లను బద్దలుకొట్టిన మొండి మొక్కవు నువ్వు’ అనే లైన్‌ నాకు బాగా నచ్చింది. దేవి శ్రీ ప్రసాద్‌ ఈ పాటకు ప్రాణం పెట్టారు. పవన్‌ కళ్యాణ్‌కి దేవి శ్రీ ప్రసాద్‌ పాటాభిషేకం చేస్తే, చంద్రబోస్‌ సిరాభిషేకం చేశారు’ అని అన్నారు.

‘పవన్‌ కళ్యాణ్‌లో నాకు బాగా నచ్చే విషయం ఏంటంటే.. ఆయన మనుషులను గౌరవించే విధానం, మనుషులను గుర్తు పెట్టుకునే విధానం. ఒక్కసారి మనిషి నచ్చాడంటే జీవితాంతం గుర్తు పెట్టుకుంటారు. అది ఆయన గొప్పతనం. ‘దేఖ్‌లేంగే సాలా’ విని, చాలా రోజుల తరువాత నాకు డ్యాన్స్‌ చేయాలనే ఉత్సాహం కలిగిందని పవన్‌ కళ్యాణ్‌ నన్ను అభినందించారు. అలాగే ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ పాట విని నాకు ఫోన్‌ చేసి, చాలా బాగుందని అభినందించారు’ అని సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్‌ చెప్పారు. గీత రచయిత చంద్రబోస్‌ మాట్లాడుతూ, ‘ఈ పాట పవన్‌ కళ్యాణ్‌ నిజమైన మనస్తత్వం, నిజమైన వ్యక్తిత్వం, ఆయన నమ్మిన సిద్ధాంతాలు, ఆయన ఆచరించే సూత్రాలు, ఎంచుకున్న మార్గం, ఆ మార్గంలో పయనించే విధానం. ఇది నిజం.. ఇది పవనిజం’ అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -