గల్లీ నుంచి ఢిల్లీ వెళ్లడానికి జమియత్ సహకారం
జమియత్ ఉలమా యే హింద్ సంస్థ సభలో సీఎం రేవంత్రెడ్డి
నవతెలంగాణ-శంషాబాద్
విద్వేష ప్రసంగాల నియంత్రణ కోసం వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో చట్టం తీసుకురాబోతున్నామని సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు. తాను గల్లీ నుంచి ఢిల్లీకి వెళ్లడానికి జమియత్ సహకరించిందని సీఎం గుర్తు చేశారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మెట్రో క్లాసిక్ గార్డెన్స్లో గురువారం జమీయత్ ఉలమా యే హింద్ సంస్థ నిర్వహించిన సభకు సీఎం హాజరై మాట్లాడారు. జమీయత్ ఉలమా దేశ స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న సంస్థ అని చెప్పారు. దేశ స్వాతంత్య్రం కోసం కాంగ్రెస్ పోరాటం చేసిందని, దేశంలో మైనార్టీలు, మెజారిటీ ప్రజలు కలిసి ముందుకు వెళ్లడానికి జమీయత్ సంస్థ పాటుపడుతుందని అన్నారు. లోక్సభలో రాహుల్ గాంధీకి తోడుగా మోడీ, అమిత్షాపై పోరాటం చేశానన్నారు. మైనారిటీల అండతో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిందన్నారు. నిజాంపై షోయబుల్లా ఖాన్ లాంటి వాళ్లు పోరాటం చేశారని తెలిపారు. సల్మాన్ ఖుర్షిద్, హమ్మద్ పటేల్ లాంటి వాళ్లు కాంగ్రెస్లో అగ్ర నాయకులు అయ్యారని తెలిపారు.
రాష్ట్రంలో అజారుద్దీన్, షబీర్ అలీ లాంటి వాళ్లకు పదవులు ఇచ్చామన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో మైనార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని సూచించారు. దేశం అభివృద్ధి చెందాలంటే కలిసి మెలిసి ముందుకు సాగాలన్నారు. పెట్టుబడులు రావాలంటే శాంతి భద్రతల పరిరక్షణ అవసరమన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రాష్ట్రంలో మైనారిటీలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కలిపించారని గుర్తు చేశారు. ఈ అంశం ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉందన్నారు. కులగణన సమయంలో రాష్ట్రంలో మైనారిటీ జనాభా కూడా లెక్కించామన్నారు. సుప్రీం కోర్టులో నాలుగు శాతం రిజర్వేషన్ల కేసు వచ్చినప్పుడు మైనార్టీ జనాభా లెక్కలను అందజేస్తామని హామీ ఇచ్చారు. మైనార్టీలు విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఒక పార్టీ అవయవదానం చేయడంతో బీజేపీ ఓట్ల శాతం భారీగా పెరిగిందని బీఆర్ఎస్ను ఉద్దేశించి మాట్లాడారు. మైనార్టీలను అన్ని విధాలా ఆదుకుంటామని భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో జమీయత్ ఉలమా యే హింద్ సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
విద్వేష ప్రసంగాల నియంత్రణ కోసం ప్రత్యేక చట్టం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



