– మృతదేహంతో బంధువుల ఆందోళన
నవతెలంగాణ-వేంసూరు
బెల్ట్ షాప్ నిర్వాహకుని ఆగడాలకు మనస్తాపానికి గురైన ఓ మహిళ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఖమ్మం జిల్లా వేంసూరు మండలం అడసర్లపాడు గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. అడసర్లపాడుకు చెందిన ఉప్పతల భవాని(35) భర్త రవి గురువారం రాత్రి అడసర్లపాడులో ఓ బెల్టు షాపులో తాగి.. 100 రూపాయలు బాకీ పెట్టాడు. దాంతో బెల్ట్ షాప్ నిర్వాహకుడు వంద రూపాయల కోసం రవి ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నాడు. ఇంటికి వచ్చిన భర్త ద్విచక్ర వాహనం తీసుకురాకపోవడంతో భార్య ఆరా తీయగా అదే బజారులో బెల్ట్ షాపులో ఉన్నదని తెలుసుకొని బెల్ట్ షాపులో రూ.100 కట్టి వాహనాన్ని ఇంటికి తీసుకువెళ్లారు. ఇదే సమయంలో తన భర్తకు అప్పు ఇవ్వొద్దని ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు ఇస్తున్నారని భవాని బెల్ట్సాపు నిర్వాహకులను ప్రశ్నించింది. దాంతో ఇరువురు మధ్య గొడవ జరిగింది. ఇంటికి వెళ్లిన భవాని కొద్దిసేపటికి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కాగా, భవాని మృతికి బెల్ట్సాపు నిర్వాహకులే కారణమంటూ ఆమె మృతదేహంతో కుటుంబ సభ్యులు, బంధువులు బెల్ట్షాపు ఎదుట ఆందోళనకు దిగారు. బెల్ట్షాపు నిర్వాహకుడు, అతని కుటుంబ సభ్యులు భవానిని దుర్భాషలాడారని దాంతో ఆమె తీవ్ర మానసిక ఒత్తిడికి లోనై మృతి చెందినట్టు బంధువులు ఆరోపిస్తున్నారు. బాధ్యులపై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ఎస్ఐ కవిత కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మనస్తాపంతో మృతి చెందిందా వేరే ఏమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
బెల్ట్షాప్ నిర్వాహకుడి ఆగడాలకు మహిళ బలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



