– కామారెడ్డి జనరల్ ఆస్పత్రి ముందు ధర్నా
నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి జనరల్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ డాటా ఆపరేటర్లు, ఆక్సిజన్ ప్లాంట్ ఆపరేటర్లులను విధుల్లోకి తీసుకోవాలని, గత మూడు నెలలుగా పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించాలని కోరుతూ కామారెడ్డి జనరల్ ఆస్పత్రి ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అమిన్ ఉద్దీన్, ఇమ్రాన్, గంగాధర్ లు మాట్లాడుతూ .. గత పది సంవత్సరాలుగా విధుల్లో ఉన్న తాము, అక్టోబర్ ఒకటో తేదీ నుంచి విధుల్లోకి రావద్దని జనరల్ హాస్పిటల్ సూపరిండెంట్ వెంకటేశ్వర్లు హెచ్చరించారని, ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా సమయంలో ప్రాణాలకు సైతం లెక్కచేయకుండా సేవలు అందించడం జరిగిందని, ఇప్పుడు ఉద్యోగాల నుండి తొలగించడం అన్యాయం అని వారు పేర్కొన్నారు.
ఇట్టి విషయంపై జిల్లా కలెక్టర్ను కలవడం జరిగిందని మళ్లీ విధుల్లోకి చేర్చేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. సూపరిడెంట్ వెంకటేశ్వర్లు బడ్జెట్ లేదని, విధుల్లోకి వస్తే కూడా జీతాలు ఇవ్వలేనని చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తమ కుటుంబాలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాయని, వెంటనే విధుల్లోకి తిరిగి తీసుకోవాలని, వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇతర జిల్లాల్లో పనిచేస్తున్న ఆరోగ్యశ్రీ డేటా ఆపరేటర్లను తొలగించలేదని, కామారెడ్డిలో మాత్రమే ఈ అన్యాయం జరిగిందని పేర్కొన్నారు.
తమ సమస్య పరిష్కారం కాని పక్షంలో పై అధికారులను, అవసరమైతే కోర్టు వరకు వెళ్లి తమ గోడు తెలియజేస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల రూపాయలు ఖర్చు ఇస్తుందని పేషెంట్ల దగ్గర డబ్బులు కూడా తీసుకుంటున్నారని, ఆ వీడియో మా దగ్గర ఉన్నాయని తెలిపారు. మమ్ములను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని లేకపోతే ఆ వీడియోలు తీసుకొని పై అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో దువ్వల సాయికుమార్, నర్సింలు, హరి కుమార్, స్వరూప, ఆనంద్ పాల్గొన్నారు.