Monday, June 2, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుకేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు

కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు

- Advertisement -

– 28న హాజరు కావాలని ఆదేశం
– ఫార్ములా-ఈ రేసులో మరో పరిణామం
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి

ఫార్ములా-ఈ కార్‌ రేసింగ్‌ కేసులో మరో పరిణామం చోటు చేసుకున్నది. ఈ నెల 28న తమ ఎదుట హాజరు కావాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు సోమవారం ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో ఇప్పటికే ఒకసారి కేటీఆర్‌ను ఏసీబీ విచారించింది. ఆ సమయంలోనే అవసరమైతే మరోసారి విచారణకు పిలుస్తామని తెలిపింది. ఈ నేపథ్యంలో తాజాగా ఏసీబీ విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు ఇచ్చింది.
విదేశాల నుంచి తిరిగొచ్చాక విచారణకొస్తా..: ఏసీబీ నోటీసులపై కేటీఆర్‌
బీఆర్‌ఎస్‌ రజతోత్సవ కార్యక్రమాలకు హాజరయ్యేందుకు లండన్‌, అమెరికాకు వెళుతున్నందున బుధవారం నాటి ఏసీబీ విచారణకు హాజరు కాలేనని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తెలిపారు. ఆయా దేశాలకు తన పర్యటన ముందే ఖరారైందని ఆయన వివరించారు. అందువల్ల విదేశాల నుంచి తిరిగొచ్చాక కచ్చితంగా విచారణకు హాజరవుతానని లిఖితపూర్వకంగా తెలిపారు. ఈ మేరకు కేటీఆర్‌ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. తనను రాజకీయంగా వేధించాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్‌ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తోందని ఆయన ఈ సందర్భంగా వాపోయారు. అయినప్పటికీ చట్టాన్ని గౌరవించే పౌరుడిగా విచారణ సంస్థలకు తాను పూర్తిగా సహకరిస్తామని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ తప్పిదాలు, అరాచకాలను ప్రశ్నిస్తున్నందుకు తనపై రగిలిపోతున్న సీఎం రేవంత్‌ రెడ్డి.. ప్రతీకారంతో ఎంతకైనా దిగజారుతారన్న సంగతి ఈ ఏసీబీ నోటీసులతో తేటతెల్లమైందని కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయన నాయకుడిగానే కాకుండా, మనిషిగా కూడా ఎంతగా పతనమవుతున్నారో చెప్పడానికి ఈ చౌకబారు ప్రతీకార చర్యలే నిదర్శనమంటూ విమర్శలు గుప్పించారు. బీఆర్‌ఎస్‌ను చూస్తే రేవంత్‌లో రోజురోజుకూ భయం పెరిగిపోతోందని ఎద్దేవా చేశారు.
సమస్యల నుంచి దృష్టి మళ్లించటానికే : ఎమ్మెల్సీ కవిత
తమ వైఫల్యాలను కప్పిపుచ్చు కోడానికి, ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికే రేవంత్‌ ప్రభుత్వం, కేటీఆర్‌కు కుట్రపూరితంగా నోటీ సులు జారీ చేసిందని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొ న్నారు. ప్రభుత్వం చర్యలను ఆమె తీవ్రంగా ఖండిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కుటిల రాజకీయ క్రీడలో భాగంగానే ఏసీబీ నోటీసులు జారీ చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పార్టీ నాయకులకు వరుసగా నోటీసులు జారీ చేయడం వెనుక రాజకీయ దురుద్దేశం దాగుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా, తట్టుకుని నిలబడగల చరిత్ర కేసీఆర్‌ సైన్యానికి ఉందని కవిత పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -