Friday, June 27, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్ఆర్టీఏ, సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలపై ఏసీబీ ఆకస్మిక దాడులు

ఆర్టీఏ, సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలపై ఏసీబీ ఆకస్మిక దాడులు

- Advertisement -


ఆర్టీఏ ఆఫీసుల్లో 1.80లక్షలు, సబ్‌రిజిస్ట్రార్‌లో రూ.91వేలు..
లెక్క పత్రాల్లేని డబ్బులు స్వాధీనం
ఇక్కడి అవినీతిపై ప్రభుత్వానికి నివేదిక
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి, సిటీబ్యూరో, కంటోన్మెంట్‌, ఉప్పల్‌/ మద్నూర్‌/భీమదేవరపల్లి

రాష్ట్రంలోని కొన్ని ఆర్టీఏ, సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో గురువారం ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. కార్యాలయాల్లో అధికారులు, సిబ్బంది అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నట్టు ఏసీబీకి విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో ఏసీబీ డైరెక్టర్‌ జనరల్‌ విజయకుమార్‌ ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి.. ఆరోపణలు వచ్చిన ఆర్టీఏ కార్యాలయాలు, చెక్‌పోస్టులు, సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో గురువారం మెరుపుదాడులు నిర్వహించారు. ఉదయం నుంచి రాత్రి వరకు తనిఖీలు కొనసాగాయి. పలుచోట్ల ఆర్టీఏ, సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల వద్ద అధికారులు, సిబ్బంది టేబుళ్లలో లెక్కపత్రాలు లేని డబ్బులు పెద్దమొత్తంలో దొరికాయి. అలాగే, పలుచోట్ల కొందరు ప్రయివేట్‌ ఏజెంట్ల సాయంతో అధికారులు, సిబ్బంది అవినీతికి పాల్పడుతున్నట్టు వెల్లడైంది. ఈ నేపథ్యంలో కామారెడ్డి జిల్లా సాలావాత్‌పూర్‌ ఆర్టీఏ కార్యాలయం, పెద్దపల్లి ఆర్టీఏ కార్యాలయం, హైదరాబాద్‌లోని తిరుమలగిరి, ఉప్పల్‌ ఆర్టీఏ కార్యాలయాల్లో జరిగిన సోదాల్లో లెక్కల్లో చూపని డబ్బును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కొందరు అధికారుల అక్రమ వ్యవహారాలపై నివేదిక రూపొందించారు. మరోవైపు ఖమ్మం జిల్లా బూర్గంపాడు, వరంగల్‌ జిల్లాలోని భీమాదేవరపల్లి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు కొనసాగించారు. ఆర్టీఏ, సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో తాము జరిపిన ఆకస్మిక దాడులు, స్వాధీనం చేసుకున్న డబ్బుతో పాటు అక్కడ జరుగుతున్న అవినీతి గురించి ప్రభుత్వానికి నివేదికను పంపిస్తున్నట్టు ఏసీబీ డీజీ విజయకుమార్‌ తెలిపారు.
పలువురు ఏజెంట్లు అదుపులోకి..
తిరుమలగిరి ఆర్టీఏ కార్యాలయంలో ఏసీబీ అధికారులు మధ్యాహ్నం 12గంటలకు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. ఉదయం నుండే ఏసీబీ అధికారులు పలు బృందాలుగా విడిపోయి తిరుమలగిరి ఆర్టీఏ కార్యాలయానికి చేరుకుని ఏజెంట్ల వ్యవహారాన్ని పసిగట్టి అదుపులోకి తీసుకున్నారు. ఏజెంట్లపై పక్కా నిఘా ఉంచిన ఏసీబీ టీంలు 20మందిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. ఏజెంట్ల నుంచి నగదు, పలు వాహన ధ్రువీకరణ పత్రాలు, సెల్‌ఫోన్లు, ఇతర డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్టు ఏసీబీ డీఎస్పీ శ్రీధర్‌ తెలిపారు. ఆర్టీవో సిబ్బందిపై పలు ఆరోపణలు ఉన్న నేపధ్యంలో వారిని కూడా విచారిస్తామని చెప్పారు. ఇన్‌చార్జి ఆర్టీవోను అన్ని కోణాల్లో విచారించి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. ఒక్కో ఏజెంట్‌ దగ్గర 50 వాహన ధ్రువీకరణ పత్రాలు ఉన్నట్టు నిర్ధారణకు వచ్చినట్టు చెప్పారు. ఇదిలావుంటే ఉప్పల్‌ ఆర్టిఏ కార్యాలయంపై ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో రంగారెడ్డి రేంజ్‌ ఏసీబీ డీఎస్పీ ఆనంద్‌ కుమార్‌ ఆధ్వర్యంలో కార్యాలయంలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడుగురు ఏజెంట్లు, నలుగురు అధికారులను అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. ఏజెంట్ల వద్ద నుంచి రూ.3,400 స్వాధీనం చేసుకొని, వారి సెల్‌ఫోన్లను, పలు డాక్యుమెంట్లను పరిశీలిస్తున్నట్టు తెలిపారు. ఉప్పల్‌ ఆర్టీవో కార్యాలయంపై వివిధ రకాల ఫిర్యాదులు రావడం, ఏజెంట్ల ద్వారా అవినీతికి పాల్పడుతున్నారని తెలియడంతో ఉన్నతాధి కారులు సూచనలు మేరకు ఆకస్మిక తనిఖీలు నిర్వహిం చినట్టు వివరించారు. ఈ తనిఖీల్లో ఏడుగురు ఏజెంట్లుగా వ్యవహరిస్తూ లైసెన్సులకు, ఆర్సీలకు పైరవీలు చేయడం గమనించామని, వారిని ప్రశ్నిస్తున్నట్టు తెలిపారు. ఏజెంట్ల వద్ద సుమారు రూ.3400 రూపాయలు ఉన్నాయని, వారి ఫోన్‌లలో జరిగిన లావాదేవీలను పరిశీలిస్తున్నామని, పూర్తి విచారణ తర్వాత వివరాలు వెల్లడిస్తామని వివరించారు.
కామారెడ్డిలో పరారీలో ఆర్టీవో చెక్‌పోస్ట్‌ అధికారుల అసిస్టెంట్లు
కామారెడ్డి జిల్లా మద్నూర్‌ మండలంలోని సలాబత్పూర్‌ అంతర్రాష్ట్ర ఆర్టీవో చెక్‌పోస్టులో ఇతర రాష్ట్రాలకు వెళ్లే లారీల వారి నుంచి భారీ మొత్తంలో అక్రమ వసూళ్లు చేస్తున్నట్టు సమాచారం మేరకు ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. దాంతో ఈ చెక్‌పోస్టులో పనిచేసే ఆర్టీవో అధికారుల అసిస్టెంట్లు పరారైనట్టు తెలిసింది. ఈ దాడుల్లో రూ.92వేలు స్వాధీనం చేసుకున్నారు. విధుల్లో ఉన్న అసిస్టెంట్‌ మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌, కానిస్టేబుల్‌, ఇద్దరు ప్రయివేట్‌ వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. కొన్ని గంటల వ్యవధిలోనే రూ.92వేలు అక్రమ వసూళ్లు జరిగినట్టు తెలుస్తోంది. దాడులు నిర్వహించిన వారిలో ఏసీబీ డీఎస్పీ శ్రీనివాస్‌ గౌడ్‌, సీఐ నరేష్‌, శ్రీనివాస్‌, నవీన్‌ తదితరులున్నారు.
హనుమకొండలో రూ.96,870 సీజ్‌
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో నలుగురు డాక్యుమెంటరీ రైటర్స్‌ వద్ద రూ.96,870 స్వాధీనం చేసుకొని సీజ్‌ చేసినట్టు ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపారు. సబ్‌ రిజిస్ట్రార్‌ కిషన్‌ నాయక్‌ అనుమతితోనే కార్యాలయం లోపల ఉంటున్నట్టు డాక్యుమెంట్‌ రైటర్స్‌ తెలపడం గమనార్హం. కాగా, డాక్యుమెంట్‌ రైటర్స్‌కు లోపలికి ప్రవేశం ఉండదని, 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కొన్ని ఫైల్స్‌ను పై అధికారులకు పంపాల్సి ఉండగా పంపకుండా ఉంచినట్టు డీఎస్పీ తెలపారు. విచారణ, ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చిన తర్వాత సదరు అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎవరైనా బాధ్యతగా చేయాల్సిన పనులు చేయకుండా అక్రమంగా డబ్బులు అడిగితే 1064కు ఫిర్యాదు చేయాలన్నారు. దాడుల్లో సీఐలు ఎస్‌ రాజు, ఎల్‌ రాజు, సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -