నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
కోటి రూపాయల ప్రమాద బీమా పథకం అమలులో పలు రాష్ట్రాలకు సింగరేణి కాలరీస్ ఆదర్శంగా నిలిచిందని ఆ సంస్థ సీఎమ్డీ ఎన్ బలరాం అన్నారు. మణుగూరుకు చెందిన ఈపీ ఆపరేటర్ మూల్చంద్ విశ్వకర్మ ఇటీవల ప్రమాదంలో మరణించారు. ఆయన సతీమణి హరిదేవి విశ్వకర్మకి శుక్రవారం కొత్తగూడెం హెడ్డాఫీసులో కోటి రూపాయల ప్రమాద బీమా చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎమ్డీ మాట్లాడారు. మణుగూరులో ప్రమాదంలో మృతి చెందిన మూల్ చంద్ విశ్వకర్మకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కార్పొరేట్ శాలరీ అకౌంట్ ఉందనీ, ఈ నేపథ్యంలో ఆయన కుటుంబానికి కోటి రూపాయల బీమా వర్తించిందన్నారు. దేశంలో ఏ ఇతర రాష్ట్రాలు, ప్రభుత్వ సంస్థల్లో లేని విధంగా సింగరేణి సంస్థ తొలిసారిగా బ్యాంకులతో మాట్లాడి గరిష్టంగా రూ.కోటి 25 లక్షలు ప్రమాద బీమా పథకాన్ని అమలు చేస్తున్నదని తెలిపారు. దీనివల్ల ప్రమాద బాధిత మృతుల కుటుంబీకులకు ఆర్థికంగా గట్టి భరోసా లభిస్తుందని చెప్పారు. సింగరేణిలో అమలు జరుగుతున్న ఈ ప్రమాద బీమా పథకాన్ని అసోం, ఉత్తరప్రదేశ్ సహా పలు రాష్ట్రాలు, కోల్ ఇండియాలో కూడా అమల్లోకి తెచ్చారని వివరించారు. కాంట్రాక్టు కార్మికులకు కూడా రూ.40 లక్షల వరకు ప్రమాద బీమా పథకాన్ని అమలు జరుపుతున్నామన్నారు. కొత్తగూడెంలో మృతుడి కుటుంబీకులకు డైరెక్టర్ ఆపరేషన్స్ ఎల్వీ సూర్యనారాయణ, డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ మరియు పర్సనల్ కే వెంకటేశ్వర్లు, ఎస్బీఐ డీజీఎం సత్యనారాయణ రూ.కోటి ప్రమాద బీమా చెక్కును శ్రీమతి హరిదేవి విశ్వకర్మకు అందజేశారు. కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (కోల్ మూమెంట్) ఎస్డీఎమ్ సుభానీ, జీఎం(ఐఆర్, పీఎం) కవితా నాయుడు , జీఎం(ఆర్సీ) కుమారి నికోలస్, జీఎం(వెల్ఫేర్) జీవీ కిరణ్కుమార్, హెచ్ఓడీ (ఈఈ సెల్) ఏజేఎమ్ మురళీధర్, గుర్తింపు, ప్రాతినిథ్య, అధికారుల సంఘం నాయకులు ఎస్వీ రమణమూర్తి, ఎస్ పీతాంబరరావు, సునీల్వర్మ తదితరులు పాల్గొన్నారు.
ప్రమాద బీమా దేశానికే ఆదర్శంసింగరేణి సీఎమ్డీ ఎన్ బలరాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES